Syed mushtaq ali trophy: హడలెత్తించిన మిలింద్‌..క్వార్టర్‌ ఫైనల్లో హైదరాబాద్‌

10 Nov, 2021 08:27 IST|Sakshi

సుల్తాన్‌పూర్‌ (గురుగ్రామ్‌): సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ టి20 క్రికెట్‌ టోర్నీ లో హైదరాబాద్‌ జట్టు క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ను సొంతం చేసుకుంది. ఎలైట్‌ గ్రూప్‌ ‘ఈ’లో భాగంగా మంగళవారం జరిగిన చివరిదైన ఐదో మ్యాచ్‌లో హైదరాబాద్‌ 29 పరుగులతో ఉత్తరప్రదేశ్‌ను ఓడించింది. హైదరాబాద్‌ ఎడంచేతి వాటం పేసర్‌ సీవీ మిలింద్‌ ప్రత్యర్థి జట్టును హడలెత్తించాడు. 3.2 ఓవర్లు వేసిన మిలింద్‌ కేవలం 8 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసి ఉత్తరప్రదేశ్‌ను దెబ్బ తీశాడు. దాంతో 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఉత్తరప్రదేశ్‌ 19.2 ఓవర్లలో 118 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది.

ఈ గెలుపుతో హైదరాబాద్‌ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలిచి 20 పాయింట్లతో గ్రూప్‌లో టాపర్‌గా నిలిచి క్వార్టర్‌ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈనెల 18న జరిగే క్వార్టర్‌ ఫైనల్లో గుజరాత్‌ జట్టుతో హైదరాబాద్‌ ఆడుతుంది. ఓవరాల్‌గా లీగ్‌ దశలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా సీవీ మిలింద్‌ (16 వికెట్లు) నిలిచాడు.  అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 147 పరుగులు చేసింది. కెప్టెన్‌ తన్మయ్‌ అగర్వాల్‌ (46 బంతుల్లో 62; 7 ఫోర్లు, 1 సిక్స్‌) ఈ టోర్నీలో నాలుగో అర్ధ సెంచరీని నమోదు చేశాడు.

చదవండి: IND Vs NZ: ఆ ముగ్గురు ఐపీఎల్‌ స్టార్లకు టీమిండియాలో చోటు దక్కలేదు.. అయినా..!

మరిన్ని వార్తలు