Ind Vs Eng: టీమిండియాదే క్రెడిట్‌ అంతా: ఇంగ్లండ్‌ కోచ్‌

7 Sep, 2021 16:42 IST|Sakshi

లండన్‌: నాలుగో టెస్టులో విజయం సాధించిన టీమిండియాపై ఇంగ్లండ్‌ జట్టు హెడ్‌ కోచ్‌ క్రిస్‌ సిల్వర్‌వుడ్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. భారత జట్టుకు పట్టుదలగా పోరాడటం వెన్నతో పెట్టిన విద్య అని వ్యాఖ్యానించాడు. ఓవల్‌ టెస్టులో కోహ్లి సేనపై ఒత్తిడి పెంచితే ఫలితం వేరేలా ఉండేదని, కానీ వాళ్లు తమకు ఛాన్స్‌ ఇవ్వలేదని పేర్కొన్నాడు. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా ఓవల్‌ వేదికగా జరిగిన నాలుగో మ్యాచ్‌లో టీమిండియా 157 పరుగుల తేడాతో ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టును మట్టికరిపించిన విషయం తెలిసిందే. తద్వారా 2-1 తేడాతో సిరీస్‌లో ఆధిక్యంలోకి వచ్చింది.

ఈ నేపథ్యంలో క్రిస్‌ సిల్వర్‌వుడ్‌ స్కై స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘నిజం చెప్పాలంటే... తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే టీమిండియాను కట్టడి చేశాం. రెండో ఇన్నింగ్స్‌లో మేం బాగానే బ్యాటింగ్‌ చేస్తున్నామనుకునే క్రమంలో తడబడ్డాం. భారత ఆటగాళ్లపై ఒత్తిడి పెంచడంలో విఫలమయ్యాం. క్రెడిట్‌ అంతా టీమిండియాకే దక్కుతుంది.

ఎందుకంటే.. వారికి ఎలా పోరాడాలో.. పోగొట్టుకున్న చోట ఎలా వెతుక్కోవాలో వారికి బాగా తెలుసు. ఓటమి గురించి మాట్లాడే క్రమంలో డ్రెస్సింగ్‌రూంలో ఈ విషయాలను మేం చర్చింకున్నాం’’ అని పేర్కొన్నాడు. కాగా బుమ్రా అద్భుతమైన పేస్‌ బౌలింగ్‌, శార్దూల్‌ ఠాకూర్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

చదవండి: మ్యాచ్‌ గెలిపించినా అక్షింతలు తప్పలేదు.. టీమిండియా కెప్టెన్‌పై బీసీసీఐ ఆగ్రహం

మరిన్ని వార్తలు