సూర్య ప్రతాపం.. భారత్‌ విజయం

19 Mar, 2021 05:01 IST|Sakshi

నాలుగో టి20లో 8 పరుగులతో భారత్‌ గెలుపు

సూర్యకుమార్‌ యాదవ్‌ మెరుపు అర్ధ సెంచరీ 

2–2తో సిరీస్‌ సమం శనివారం చివరి మ్యాచ్‌

అహ్మదాబాద్‌: పొట్టి ఫార్మాట్‌లో నంబర్‌వన్‌ ఇంగ్లండ్‌ గెలిచిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఛేదించే ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లోనూ 16 ఓవర్లు ముగిసే సరికి 140/4 స్కోరుతో పోరాటంలో నిలిచింది. 24 బంతుల్లో మరో 46 పరుగులు కావాలి.  స్టోక్స్‌ ధనాధన్‌గా సాగుతుండగా... మోర్గాన్‌ అండగా ఉన్నాడు. ఈ దశలో 17వ ఓవర్‌ వేసిన శార్దుల్‌ వాళ్లిద్దరిని వరుస బంతుల్లో పెవిలియన్‌ చేర్చడంతో మ్యాచ్‌ భారత్‌ వైపు తిరిగింది. కోహ్లి సేన 8 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.

ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 185 పరుగులు చేసింది. కెరీర్‌లో ఆడిన తొలి ఇన్నింగ్స్‌లోనే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సూర్యకుమార్‌ యాదవ్‌ (31 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అదరగొట్టాడు. శ్రేయస్‌ అయ్యర్‌ (18 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా ఆడాడు. ఆర్చర్‌కు 4 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. బెన్‌ స్టోక్స్‌ (23 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), జేసన్‌ రాయ్‌ (27 బంతుల్లో 40; 6 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు.

టాప్‌ మళ్లీ ఫ్లాప్‌
ఆట మొదలైన తొలి బంతినే హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ సిక్సర్‌గా బాదేశాడు. కానీ నాలుగో ఓవర్‌ వేసిన ఆర్చర్‌ బౌలింగ్‌లో అతనికే రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి రోహిత్‌ (12; 1 ఫోర్, 1 సిక్స్‌) ఔటయ్యాడు. రాహుల్‌ (14) స్టోక్స్‌ బౌలింగ్‌లో ఆర్చర్‌ చేతికి చిక్కగా, కోహ్లి (1) రషీద్‌ గూగ్లీకి స్టంపౌటయ్యాడు.   సిక్సర్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో పరుగులు మొదలుపెట్టిన సూర్యకుమార్‌ బంతుల్ని పదే పదే బౌండరీలకు, సిక్సర్లకు తరలించాడు. ఈ క్రమంలో కేవలం 28 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో మెరుపు ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు.  

రాణించిన రాయ్, స్టోక్స్‌
లక్ష్యఛేదనలో బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న ఇంగ్లండ్‌ జట్టును ఎప్పట్లాగే జేసన్‌ రాయ్‌ ధాటిగా నడిపించాడు. కానీ బట్లర్‌ (9), మలాన్‌ (14) నిష్క్రమణతో ఇన్నింగ్స్‌ తడబడింది. ఈ దశలో బెయిర్‌ స్టో (19 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్‌), స్టోక్స్‌ నాలుగో వికెట్‌కు చకచకా 65 పరుగులు జోడించడం భారత శిబిరాన్ని ఒత్తిడిలోకి నెట్టింది. అయితే 17వ ఓవర్లో వరుస బంతుల్లో స్టోక్స్, మోర్గాన్‌ (4)లు ఔటయ్యారు. ఆఖరి ఓవర్లో 23 పరుగులు చేయాల్సివుండగా శార్దుల్‌ 14 పరుగులు ఇవ్వడంతో భారత్‌ ఊపిరి పీల్చుకుంది.

స్కోరు వివరాలు :
భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) అండ్‌ (బి) ఆర్చర్‌ 12; రాహుల్‌ (సి) ఆర్చర్‌ (బి) స్టోక్స్‌ 14; సూర్య (సి) మలాన్‌ (బి) కరన్‌ 57; కోహ్లి (స్టంప్డ్‌) బట్లర్‌ (బి) రషీద్‌ 1; పంత్‌ (బి) ఆర్చర్‌ 30; శ్రేయస్‌ (సి) మలాన్‌ (బి) ఆర్చర్‌ 37; పాండ్యా (సి) స్టోక్స్‌ (బి) వుడ్‌ 11; శార్దుల్‌ నాటౌట్‌ 10; సుందర్‌ (సి) రషీద్‌ (బి) ఆర్చర్‌ 4; భువీ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 185.
వికెట్ల పతనం: 1–21, 2–63, 3–70, 4–110, 5–144, 6–170, 7–174, 8–179.
బౌలింగ్‌: రషీద్‌ 4–1–39–1, ఆర్చర్‌ 4–0–33–4, వుడ్‌ 4–1–25–1, జోర్డాన్‌ 4–0–41–0, స్టోక్స్‌ 3–0–26–1, కరన్‌ 1–0–16–1.

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌: రాయ్‌ (సి) సూర్య(బి) పాండ్యా 40; బట్లర్‌ (సి) రాహుల్‌ (బి) భువనేశ్వర్‌ 9; మలాన్‌ (బి) చహర్‌ 14; బెయిర్‌స్టో (సి) సుందర్‌ (బి) చహర్‌ 25; స్టోక్స్‌ (సి) సూర్య (బి) శార్దుల్‌ 46; మోర్గాన్‌ (సి) సుందర్‌ (బి) శార్దుల్‌ 4; కరన్‌ (బి) పాండ్యా 3; జోర్డాన్‌ (సి) పాండ్యా (బి) శార్దుల్‌ 12; ఆర్చర్‌ నాటౌట్‌ 18; రషీద్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 6, మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 177.
వికెట్ల పతనం: 1–15, 2–60, 3–66, 4–131, 5–140, 6–140, 7–153, 8–177.
బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–1–30–1, పాండ్యా 4–0–16–2, శార్దుల్‌ 4–0–42–3, సుందర్‌ 4–0–52–0, చహర్‌ 4–0–35–2.


(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు