అడిలైడ్‌లో ఆసీస్‌తో భారత్‌ డేనైట్‌ టెస్టు

19 Oct, 2020 06:23 IST|Sakshi

బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ధ్రువీకరణ

కోల్‌కతా: ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు తొలి టెస్టును అడిలైడ్‌ వేదికగా డేనైట్‌లో ఆడుతుందని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ధ్రువీకరించాడు. వచ్చే నెలలో టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని క్రికె ట్‌ ఆస్ట్రేలియా (సీఏ) తమకు పంపిందని ‘దాదా’ చెప్పాడు. ‘ఆసీస్‌తో భారత్‌ మూడు టి20లు, మరో మూడు వన్డేలతో పాటు నాలుగు టెస్టుల సిరీస్‌లో తలపడుతుంది. తొలి టెస్టును ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఆడుతుంది. అడిలైడ్‌లో ఈ పింక్‌బాల్‌ మ్యాచ్‌ జరుగుతుంది. కాగా తేదీలను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది’ అని గంగూలీ వివరించాడు.  
‘దాదా’ ఐసీసీ చైర్మన్‌ రేసులో నుంచి తప్పుకున్నాడా?
గంగూలీ అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) చైర్మన్‌ పదవి రేసులో ఉన్నాడంటూ కొన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్లే! భారత బోర్డు నుంచి ఐసీసీకి నామినేషన్లే రాలేదని తెలిసింది. భారత్‌కే చెందిన శశాంక్‌ మనోహర్‌ తప్పుకోవడంతో ఖాళీ అయిన ఈ పదవి కోసం నామినేషన్లను ఈ నెల 18లోపే దాఖలు చేయాల్సి ఉంది. అయితే ఆదివారంతో గడువు ముగిసినా బీసీసీఐ నుంచి నామినేషన్లు రాలేదని ఐసీసీ తెలిపింది. నామినేషన్ల స్క్రూటిని అనంతరం డిసెంబర్లో ఎన్నిక జరుగనుంది. 

మరిన్ని వార్తలు