మాక్స్‌వెల్‌ను ఆ జట్టు కొనే అవకాశం ఉంది: గంభీర్‌

18 Feb, 2021 12:57 IST|Sakshi

అప్పుడు రూ.10 కోట్లు.. పూర్తి విఫలం.. ఇప్పుడు ఫేవరెట్‌!

మాక్స్‌వెల్‌పై కాసుల వర్షం కురుస్తుందా?

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ను కొనుగోలు చేసేందుకు రాయల్‌చాలెంజర్స్‌ బెంగళూరు ఫ్రాంఛైజీ ఆసక్తి చూపే అవకాశం ఉందని భారత మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ అన్నాడు. ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ ఏబీ డివిల్లియర్స్‌పై భారం తగ్గించేందుకు మాక్సీ వైపు మొగ్గు చూపుతుందని అభిప్రాయపడ్డాడు. చెన్నైలో గురువారం ఐపీఎల్‌-2021 మినీ వేలం జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గంభీర్‌ మాట్లాడుతూ.. ‘‘కొత్త కాంబినేషన్ల కోసం ఆర్సీబీ ప్రయత్నిస్తే బాగుంటుంది.  కోహ్లి ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌గా బరిలోకి దిగితే బాగుంటుంది. దేవదత్‌ పడిక్కల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించాలి. ఏబీ వంటి హిట్టర్‌ ఎలాగో జట్టులో ఉన్నాడు. అయితే ఎప్పుడూ కోహ్లి, ఏబీపై ఆధారపడకూడదు. 

వారిపై కాస్త ఒత్తిడిని తగ్గించే ప్రయత్నంలో భాగంగా యాజమాన్యం మాక్స్‌వెల్‌ వంటి ఆటగాడిపై సహజంగానే ఆసక్తి కనబరుస్తుంది. చిన్నస్వామి స్టేడియం ఫ్లాట్‌గా చిన్నదిగా ఉంటుంది. అలాంటి మైదానంలో మ్యాక్స్‌వెల్‌ ప్రభావం చూపగలడు. ఏదేమైనా జట్టు తుది నిర్ణయం ఎలా ఉంటుందో వేలం తర్వాతే తెలుస్తుంది’’ అని పేర్కొన్నాడు. అదే విధంగా బౌలింగ్‌ విభాగంలో ఉమేశ్‌ యాదవ్‌, మొయిన్‌ అలీ వంటి క్వాలిటీ ప్లేయర్స్‌ను రిలీజ్‌ చేయడం సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డాడు. 

కాసుల వర్షం కురుస్తుందా!?
గతేడాది డిసెంబర్‌ 2019లో జరిగిన ఐపీఎల్‌ వేలంలో మ్యాక్స్‌వెల్‌ను రూ.10 కోట్లు వెచ్చించి కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ కొనుగోలు చేసింది. అయితే, యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్‌ 13వ సీజన్‌లో మ్యాక్స్‌వెల్‌ దారుణంగా విఫలమయ్యాడు. 2020 సీజన్‌లో 13 మ్యాచ్‌లాడిన ఈ ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ మొత్తంగా 108 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో పంజాబ్‌ ఫ్రాంఛైజీ అతడిని వదులుకోగా ప్రస్తుతం వేలంలోకి వచ్చాడు. ఇక మ్యాక్సీని సొంతం చేసుకునేందుకు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆసక్తి చూపడం విశేషం. ఒకవేళ ఇరు జట్లు పోటీ పడితే అతడిపై మరోసారి కాసుల వర్షం కురిసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

చదవండి: అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాళ్లు వీళ్లే! 
చదవండిశార్దూల్‌ స్థానంలో సీనియర్‌ సీమర్‌ జట్టులోకి

మరిన్ని వార్తలు