Nikhat Zareen: జాతీయ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌గా నిజామాబాద్‌ అమ్మాయి

27 Oct, 2021 20:54 IST|Sakshi

హర్యానాలోని హిస్సార్‌లో జరిగిన టోర్నమెంట్‌లో విజయఢంకా

డిసెంబర్‌లో టర్కీలో జరుగనున్న ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ టోర్నీకి ఎంపిక

సాక్షి, నిజామాబాద్‌: మహిళల సీనియర్‌ జాతీయ బెస్ట్‌ బాక్సర్‌ ఛాంపియన్‌షిప్‌ విజేతగా నిజామాబాద్‌కు చెందిన నిఖత్‌ జరీన్‌ నిలిచింది. హర్యానాలోని హిస్సార్‌లో ఈ నెల 21 నుంచి టోర్నమెంట్‌ నడుస్తోంది. బుధవారం టోర్నీ ఫైనల్‌ ముగిసింది. హర్యానాకు చెందిన మీనాక్షిని జరీన్‌ 4–1 తేడాతో ఓడించింది. మొదటి రౌండ్‌లో గోవాకు చెందిన దియా వాల్కేను నాకౌట్‌ చేసింది. క్వార్టర్‌ ఫైనల్‌లో ఒడిశాకు చెందిన సంధ్యారాణిని 5–0 తేడాతో ఓడించింది.

సెమీఫైనల్‌లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన మంజును 5–0 తేడాతో ఓడించింది. ఫైనల్‌లో మీనాక్షిపై విజయం సాధించింది. వచ్చే డిసెంబర్‌ రెండోవారంలో టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరుగనున్న మహిళల బాక్సింగ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ టోర్నీకి జరీన్‌ ఎంపికైంది. 2014లో ఇస్తాంబుల్‌లో జరిగిన జూనియర్‌ బాక్సింగ్‌ ప్రపంచ ఛాంపియన్‌గా జరీన్‌ నిలిచింది. నిజామాబాద్‌కు చెందిన సమ్‌సమ్‌ జరీన్‌కు కోచ్‌గా ఉన్నారు. నిఖత్‌ జరీన్‌ను, ఆమె కోచ్‌ సమ్‌సమ్‌ను మాజీ 400, 800 మీటర్ల నేషనల్‌ మెడలిస్ట్‌ సయీద్‌ ఖైసర్‌ అభినందించారు.
చదవండి: నీరజ్‌, మిథాలీకి ఖేల్‌రత్న.. ధవన్‌కు అర్జున అవార్డులు..!
 

>
మరిన్ని వార్తలు