PT Usha: చరిత్ర సృష్టించిన దిగ్గజ అథ్లెట్‌.. కీలక పదవిలో పీటీ ఉష! ఏకగ్రీవ ఎన్నిక

28 Nov, 2022 09:41 IST|Sakshi
పీటీ ఉష

PT Usha: దిగ్గజ అథ్లెట్‌ పీటీ ఉష భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలిగా ఎన్నిక కానుంది. 58 ఏళ్ల ఉష ఆదివారం అధ్యక్ష పదవికి నామినేషన్‌ దాఖలు చేసింది. నామినేషన్ల సమర్పణకు ఆదివారమే ఆఖరి రోజు. అయితే, ఉష మినహా మరెవరూ ఈ పదవికి నామినేషన్‌ దాఖలు చేయలేదు.

ఈ నేపథ్యంలో ఐఓఏ ప్రెసిడెంట్‌గా పీటీ ఉష ఏకగ్రీవ ఎన్నిక ఖాయమైంది. ఇక ఈ పదవి అధిరోహించనున్న మొదటి మహిళగా ఈ దిగ్గజ అథ్లెట్‌ చరిత్ర సృష్టించడం విశేషం. అయితే ఐఓఏలోని మిగతా 12 పదవుల కోసం 24 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వచ్చే నెల 10న ఐఓఏ ఎన్నికలు జరుగుతాయి.   

పరుగుల రాణి.. తృటిలో పతకం చేజారినా
కాగా కేరళకు చెందిన పీటీ ఉష సుమారు రెండున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘంగా ‘పరుగు’ప్రయాణాన్ని కొనసాగించింది. ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో ప్రపంచ వేదికలపై భారత్‌ సత్తా చాటిచెప్పింది. ఇక 25 ఏళ్ల కెరీర్‌లో పలు జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్లలో మొత్తంగా 102 పతకాలను గెలుచుకుంది ఉష.

అయితే, లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌ (1984)లో 400 మీటర్ల హర్డిల్స్‌లో త్రుటిలో కాంస్యం కోల్పోయి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ఇదిలా ఉంటే.. క్రీడా రంగంలో తన వంతు సేవ చేసిన ఉష.. ఇటీవలే రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే.

చదవండి: Ind Vs NZ: అసలేం చేస్తున్నారు.. టీమిండియాను భ్రష్టు పట్టించకండి: నెహ్రా ఘాటు వ్యాఖ్యలు! కోచ్‌గా లక్ష్మణ్‌..
ICC WC Super League: వర్షం చేసిన మేలు! టాప్‌లో టీమిండియా.. లంకకు షాకిచ్చి ముందుడుగు వేసిన అఫ్గనిస్తాన్

మరిన్ని వార్తలు