WTC: ‘రసవత్తరంగా ఉండాలంటే ప్రత్యేక విండో ఉండాలి’

4 Jun, 2021 13:11 IST|Sakshi

ప్రారంభ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్యూటీసీ) ఈవెంట్‌ నిర్వహించడానికి ప్రత్యేక విండో ఏర్పాటు చేస్తే బాగుండేదని మాజీ పాకిస్తాన్ క్రికెటర్ రమీజ్ రాజా అభిప్రాయపడ్డారు. ప్రేక్షకాదరణ పెరగాలంటే నూతన పద్ధతులను ప్రవేశపెట్టాలని సూచించారు. ఆగస్టు, 2019 లో ఇంగ్లండ్‌లో జరిగిన ఐసిసి ప్రపంచ కప్ తర్వాత డబ్యూటీసీ తొలిఎడిషన్ ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్ ఫైనల్ జూన్ 18 నుంచి సౌతాంప్టన్‌లోని అగాస్ బౌల్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగనుంది. కాగా, టెస్టు ఫార్మాట్‌లో మరింత ఆదరణ పెంచడానికి ప్రవేశపెట్టిన డబ్యూటీసీకి మరింత వన్నెతేవాలంటే ప్రత్యేక విండో ఉండాల్సిందేనన్నాడు. భవిష్యత్తులోనైనా ఈ టోర్నమెంట్ కోసం ప్రత్యేక విండోను ఏర్పాటు చేయాలని ఐసీసీ పెద్దలకు విన్నవించాడు. 

"ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పూర్తిగా భిన్నమైన విండోలో నిర్వహించాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే టెస్ట్ క్రికెట్‌కు ఆదరణ, ఆసక్తి పెరగాలంటే సరికొత్త రీతిలో దీన్ని నిర్వహించడం అవసరమని రాజా ఇండియా న్యూస్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ తన అభిప్రాయాన్నివ్యక్తం చేశాడు. టీమిండియా ఫైనల్‌కు చేరినందువల్లే డబ్యూటీసీ ముగింపు రసవత్తరంగా మారిందన్నారు. కాగా, బుధవారం రాత్రి ముంబై నుంచి ఇంగ్లండ్‌కు బయల్దేరిన భారత జట్టు.. సౌతాంప్టన్ వేదికగా జూన్ 18న న్యూజిలాండ్‌తో ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో తలపడనుంది. ఇప్పటికే భారత జట్టు, ముంబైలో 14 రోజుల క్వారంటైన్‌ను ముగించుకుని స్పెషల్ ఛార్టెర్ ప్లైట్‌‌‌లో ఇంగ్లండ్‌ గడ్డపై అడుగు పెట్టింది.

చదవండి: గంగూలీ 25 ఏళ్ల కిందటి రికార్డు బ్రేక్‌..

మరిన్ని వార్తలు