IND Vs AUS: షమీ చెవులు పిండిన అశ్విన్‌.. ఫోటో వైరల్‌

17 Feb, 2023 16:16 IST|Sakshi

బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఢిల్లీ వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య మొదలైన రెండో టెస్టు ఆసక్తికరంగా మారింది. ఆట తొలిరోజునే టీమిండియా బౌలర్లు మంచి ప్రదర్శన కనబరచడంతో ఆస్ట్రేలియా ఆలౌట్‌ అయ్యేలా కనిపిస్తోంది. అయితే తొలి టెస్టుతో పోలిస్తే ఆసీస్‌ బ్యాటర్లు కాస్త ప్రతిఘటించారు తప్ప మరోసారి స్పిన్‌ ఉచ్చులో పడిపోయారు. జడేజా, అశ్విన్‌లకు తోడు షమీ కూడా రాణించడంతో ఆస్ట్రేలియా పరుగులు చేసినప్పటికి వికెట్లు కోల్పోయింది. 

ఈ సంగతి పక్కనబెడితే ఆస్ట్రేలియా తొమ్మిదో వికెట్‌ను షమీ దక్కించుకున్నాడు. 10 పరుగులు చేసిన నాథన్‌ లియోన్‌ అతని బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. షమీ ఖాతాలో ఇది మూడో వికెట్‌. సెలబ్రేషన్‌ సమయంలో షమీ వెనుక వచ్చి నిల్చున్న అశ్విన్‌ గుడ్‌ బౌలింగ్‌ యార్‌ అంటూ చెవులు పిండాడు. అయితే అశ్విన్‌ కాస్త గట్టిగా పిండాడనుకుంటా.. నొప్పితో షమీ మొహం మారిపోయింది. అయితే ఇదంతా సరదాగా చేయడంతో టీమిండియా క్రికెటర్ల మధ్య నవ్వులు విరపూశాయి.

ఇక రెండో టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నిం‍గ్స్‌లో 263 పరుగులకు ఆలౌట్‌ అయింది. టీమిండియా స్పిన్నర్లు జడేజా, అశ్విన్‌లతో పాటు షమీ కూడా చెలరేగడంతో ఆసీస్‌ తొలిరోజునే తన ఇన్నింగ్స్‌ను ముగించాల్సి వచ్చింది. ఆసీస్‌ బ్యాటర్లలో ఉస్మాన్‌ ఖవాజా 81 పరుగులు చేయగా.. పీటర్‌ హ్యాండ్స్‌కోబ్‌ 72 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. షమీ నాలుగు వికెట్లతో చెలరేగగా.. అశ్విన్‌, జడేజాలు చెరొక మూడు వికెట్లు తీశారు.

చదవండి: పుజారా వందో టెస్టు.. కుటుంబం మొత్తం స్టేడియంలో

'చేసేయాల్సింది ఒక పనైపోయేది..'

మరిన్ని వార్తలు