LPL 2023-Suresh Raina: లంక ప్రీమియర్‌ లీగ్‌ ఆడనున్న సురేష్‌ రైనా.. ధర ఎంతంటే?

13 Jun, 2023 07:38 IST|Sakshi

టీమిండియా మాజీ క్రికెటర్‌, మిస్టర్‌ ఐపీఎల్‌ సురేష్‌ రైనా లంక ప్రీమియర్‌ లీగ్‌-2023లో ఆడేందుకు సిద్దమయ్యాడు. రాబోయే ఎడిషన్‌ కోసం జూన్‌ 14న వేలం ప్రక్రియ జరగనుంది. ఈ వేలంలో సురేష్ రైనా తన పేరును నమోదు చేసుకున్నాడు. అతడు తన బేస్‌ప్రైస్‌ 50,000 డాలర్లు(సుమారు 41 లక్షల 30 వేల రూపాయలు)గా నిర్ణయించినట్లు సమాచారం.

ఇక గతేడాది సెప్టెంబర్‌లో అన్నిరకాల క్రికెట్‌ రిటైర్మెంట్‌ ప్రకటించిన అనంతరం  రైనా విదేశీ లీగ్‌లపై దృష్టి పెట్టాడు. ఈ క్రమంలోనే అబుదాబి టీ10 లీగ్‌-2022లో డెక్కన్ గ్లాడియేటర్ తరపున ఆడాడు. ఇప్పుడు మరోసారి తన అభిమానులను ఈ మిస్టర్‌ ఐపీఎల్‌ అలరించనున్నాడు. ఇక ఈ ఏడాది ఎల్‌పీఎల్‌ జూలై 30 నుంచి ఆగస్టు 20వరకు జరగనుంది.

కాగా లంక ప్రీమియర్ లీగ్‌లో తొలిసారిగా ఐపీఎల్ తరహాలో వేలం నిర్వహించబోతున్నారు. మొదటి మూడు సీజన్లలో ప్లేయర్లను నేరుగా డ్రాఫ్ట్ రూపంలో ఐదు ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి.  ఈ ఏడాది వేలంలో 140 మంది అంతర్జాతీయ క్రికెటర్లతో సహా మొత్తం 500 మందికి పైగా క్రికెటర్లు ఈ వేలం జాబితాలో ఉన్నారు.

పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం, దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ మిల్లర్‌, ఆసీస్‌ క్రికెటర్‌ మాథ్యూవేడ్‌ వంటి ఆటగాళ్లు ఈ లీగ్‌లో భాగం కానున్నారు. అయితే ఇప్పటివరకు  లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడిన ఒకే ఒక్క భారత క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ మాత్రమే. ఒక వేళ రైనాను ఫ్రాంచైజీలు కొనుగోలు చేస్తే ఈ లీగ్‌లో భాగమైన రెండో ఆటగాడిగా రైనా నిలుస్తాడు.
చదవండి: IND vs WI: టీమిండియా విండీస్ టూర్‌ షెడ్యూల్ ఖరారు.. తొలి మ్యాచ్‌ ఎప్పుడంటే?

మరిన్ని వార్తలు