CSK: సీఎస్‌కే కెప్టెన్‌గా.. ధోని వారసుడిగా పంత్‌కే ఛాన్స్‌! ఎందుకంటే?

3 Dec, 2023 18:12 IST|Sakshi
పంత్‌- ధోని (PC: IPL/BCCI)

ఐపీఎల్‌-2024 వేలానికి ముందు టీమిండియా మాజీ వికెట్‌ కీపర్‌ దీప్‌దాస్‌ గుప్తా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐదుసార్లు చాంపియన్‌ అయిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ భవిష్యత్‌ కెప్టెన్‌గా ఎవరూ ఊహించని పేరును చెప్పాడు. మహేంద్ర సింగ్‌ ధోని వారసుడు అయ్యే అవకాశం టీమిండియా స్టార్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌కు ఉందని అభిప్రాయపడ్డాడు.

కాగా ఐపీఎల్‌-2023 ధోనికి చివరి సీజన్‌ అంటూ వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. అయితే, 40 ఏళ్ల వయసులో అనూహ్య రీతిలో చెన్నైకి ఐదోసారి ట్రోఫీ అందించిన ధోని.. రానున్న ఎడిషన్‌లోనూ బరిలోకి దిగడం దాదాపుగా ఖాయమైపోయింది. 

కానీ అతడు పూర్తిస్థాయి కెప్టెన్‌గా కొనసాగుతాడా లేదంటే.. గతంలో రవీంద్ర జడేజాకు అప్పగించిన మాదిరి ఈసారి కూడా వేరే వాళ్లకు పగ్గాలు ఇస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.  ఈ నేపథ్యంలో ధోని వారసుడిగా టీమిండియా యువ ఓపెనర్‌ రుతురాజ్‌కు ఆ అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

అయితే, దీప్‌దాస్‌ గుప్తా మాత్రం ఈ విషయంపై భిన్నంగా స్పందించాడు. అనూహ్యంగా రిషభ్‌ పంత్‌ పేరును తెరమీదకు తెచ్చాడు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ వేదికగా స్పందిస్తూ.. ‘‘ఐపీఎల్‌ 2025 నాటికి రిషభ్‌ పంత్‌ను వాళ్లు జట్టులోకి తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.

మహేంద్ర సింగ్‌ ధోని, రిషభ్‌ పంత్‌ అత్యంత సన్నిహితంగా ఉంటారు. ధోనిని రిషభ్‌ ఆరాధిస్తాడు. ఎంఎస్‌కు కూడా పంత్‌ అంటే ఇష్టమే. వాళ్లిద్దరు గతంలో చాలాకాలం వరకు కలిసి ఆడారు. ఇద్దరూ ఒకే ఆలోచనా విధానం కలిగిన వారు.

ఇద్దరూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతారు. గెలవాలన్న ఆలోచన తప్ప ప్రతికూల భావనలు దరిచేరనీయరు’’ అని దీప్‌దాస్‌ గుప్తా కొత్త చర్చకు తెరతీశాడు. కాగా డిసెంబరు 19న ఐపీఎల్‌ మినీ వేలానికి ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. గతేడాది ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన రిషభ్‌ పంత్‌.. 2023 సీజన్‌కు దూరమయ్యాడు. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా అతడి స్థానాన్ని డేవిడ్‌ వార్నర్‌ భర్తీ చేశాడు. అయితే, ఇప్పుడిపుడే కోలుకుంటున్న పంత్‌ 2024 ఎడిషన్‌లో ఢిల్లీ జట్టును ముందుకు నడిపించే అవకాశం ఉంది. 

చదవండి: షో చేయకపోవడం రాకపోవచ్చు కానీ.. భారత్‌, పాక్‌ మాజీ క్రికెటర్లు సమర్థులే: గంభీర్‌

మరిన్ని వార్తలు