IPL 2024: ఢిల్లీ అభిమానులకు గుడ్‌న్యూస్‌

11 Dec, 2023 17:17 IST|Sakshi

ఐపీఎల్‌ 2024 వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌ అభిమానులకు శుభవార్త అందింది. తమ స్టార్‌ ఆటగాడు రిషబ్‌ పంత్‌ తదుపరి సీజన్‌ నుంచి జట్టుకు అందుబాటులో ఉంటాడని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. గతేడాది కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్.. 2024 సీజన్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా సేవలందిస్తాడని పలు వార్తా సంస్థలు పేర్కొన్నాయి.

గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగానే పంత్‌ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండలేడని తెలుస్తుంది. పంత్‌ రీఎంట్రీపై ఢిల్లీ యాజమాన్యం ఎలాంటి అధికారక ప్రకటన చేయనప్పటికీ.. ఈ వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. పంత్‌.. ధోని, పార్థివ్‌ పటేల్‌, జహీర్‌ ఖాన్‌ తదితరులతో కలిసి ఓ నైట్‌ పార్టీకి అటెండ్‌ అయిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరలవుతుండగానే ఐపీఎల్‌ రీఎంట్రీపై వార్తలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

పంత్‌ ఫ్యాన్స్‌ ఈ వార్త విని సంబురాల్లో మునిగి తేలుతున్నారు. పంత్‌ గైర్హాజరీలో గత సీజన్‌లో డేవిడ్‌ వార్నర్‌ ఢిల్లీ కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. గత సీజన్‌ను చివరి నుంచి రెండో స్థానంతో ముగించిన ఢిల్లీ.. క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించకుండానే లీగ్‌ నుంచి నిష్క్రమించింది. పంత్‌ తిరిగి జట్టులో చేరితే పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. 26 ఏళ్ల పంత్‌ ఐపీఎల్‌లో 98 మ్యాచ్‌లు ఆడి సెంచరీ, 15 హాఫ్‌ సెంచరీల సాయంతో 2838 పరుగులు చేశాడు. అతని ఖాతాలో 64 క్యాచ్‌లు, ఆరు రనౌట్లు, 18 స్టంపింగ్‌లు (ఐపీఎల్‌) ఉన్నాయి. 
 

>
మరిన్ని వార్తలు