రోహిత్‌ బీఫ్‌ ఆర్డర్‌ చేశాడా.. హిట్‌మ్యాన్‌పై ట్రోలింగ్‌!

3 Jan, 2021 15:25 IST|Sakshi

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాలో పర్యటిస్తోన్నటీమిండియా జట్టులోని ఐదుగురు క్రికెటర్లు సరికొత్త వివాదానికి కేంద్ర బిందువులయ్యారు. బయో బబుల్‌ నిబంధనలను ఉల్లంఘించిన రోహిత్ శ‌ర్మ‌, రిష‌బ్ పంత్‌, శుభ్‌మ‌న్ గిల్, న‌వ్‌దీప్ సైనీ, పృథ్వీ షాలను ఐసొలేషన్‌కు తరలి వెళ్లాల్సి వచ్చింది. మెల్‌బోర్న్‌లోని ఓ రెస్టారెంట్‌లో వారు ఫుల్‌గా భోజనం చేయడం, ఈ సందర్భంగా ఓ అభిమానిని రిషబ్ పంత్ ఆలంగనం చేసుకున్న ఘటన అనంతరం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.  వీరంతా ఫుడ్‌ ఆరగించేసే సమయంలో బిల్లును ఒక అభిమాని చెల్లించాడు. ఆ క్రికెటర్ల బిల్లు ఎంత అయ్యిందని తెలుసుకుని మరీ కౌంటర్‌లో కట్టేశాడు.  క్రికెటర్లకు తెలియకుండా 118 ఆస్ట్రేలియన్‌ డాలర్లు( రూ. 6700) బిల్లు కట్టాడు. ఇక్కడ వరకూ బాగానే ఉన్నా ఆ బిల్లును సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో  వారు ఏమి తిన్నారనే విషయం చర్చకు దారి తీసింది. అదే ఇప్పుడు రోహిత్‌ శర్మను విపరీతమైన ట్రోలింగ్‌ బారిన పడేలా చేసింది. (వైరల్‌: ‘సింగిల్‌ తీయకపోతే, నీకు ఉంటది’)

అన్నీ నాన్‌వెజ్‌ వంటకాలే.. 
మెల్‌బోర్న్‌లోని రెస్టారెంట్‌లో డిన్నర్ సందర్భంగా రోహిత్ శర్మ, అతనితో ఉన్న యంగ్ క్రికెటర్లు.. అన్నీ నాన్ వెజ్ వంటకాలనే ఆర్డర్ చేశారు. రొయ్యలు, పందిమాంసం, ఆవుమాంసం, స్టిర్ ఫ్రైడ్ బీఫ్, బీన్ సాస్, పుట్టగొడుగులు, కోడిమాంసంతో తయారు చేసిన ఫ్రైడ్ రైస్, డైట్ కోక్.. వంటివి ఉన్నాయి. ఇతర ఆహార పదార్థాల గురించి పెద్దగా పట్టింపు లేనప్పటికీ.. బీఫ్‌ను మెనూలో చేర్చడం పట్ల దుమారం రేగుతోంది. మిగిలిన ఆటగాళ్లతో పోల్చుకుంటే..రోహిత్ శర్మ ఒక్కడి చుట్టే ఈ వివాదం తిరుగుతోంది. రోహిత్‌ శర్మ బీఫ్‌ ఆర్డర్‌ చేశాడనే దుమారం చెలరేగింది. ఇప్పటికే వారంతా ఐసోలేషన్‌లో ఉండగా, ఇప్పుడు ఈ వివాదం రావడం సరికొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది.  భారత్‌ ఆడిన తొలి రెండు టెస్టులకు దూరమైన రోహిత్‌.. మూడో టెస్టుకు సిద్ధమయ్యే క్రమంలో ఈ తరహా వివాదం అతని ఆత్మ విశ్వాసంపై ప్రభావం చూపే అవకాశాలు కనబడుతున్నాయి. 

మరిన్ని వార్తలు