రన్నరప్‌ అశ్విని–తనీషా జోడీ

4 Dec, 2023 03:43 IST|Sakshi

లక్నో: సయ్యద్‌ మోడి వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో ఈసారి భారత జట్టు క్రీడాకారులకు ఒక్క టైటిల్‌ కూడా లభించలేదు. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో మహిళల డబుల్స్‌ విభాగంలో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్‌) జోడీ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో అశ్విని–తనీషా ద్వయం 14–21, 21–17, 15–21తో రిన్‌ ఇవనాగ–కీ నకనిషి (జపాన్‌) జంట చేతిలో ఓడిపోయింది.

రన్నరప్‌గా నిలిచిన అశ్విని–తనీషాలకు 7,980 డాలర్ల (రూ. 6 లక్షల 64 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 5950 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. అంతకుముందు జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో యు జెన్‌ చి (చైనీస్‌ తైపీ) 20–22, 21–12, 21–17తో ప్రపంచ 12వ ర్యాంకర్‌ కెంటా నిషిమోటో (జపాన్‌)పై సంచలన విజయం సాధించి టైటిల్‌ దక్కించుకున్నాడు. మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ మాజీ చాంపియన్‌ నొజోమి ఒకుహారా (జపాన్‌) 21–19, 21–16తో లినె హొమార్క్‌ (డెన్మార్క్‌)ను ఓడించి విజేతగా నిలిచింది.

>
మరిన్ని వార్తలు