Wriddhiman Saha: మౌనం వీడిన సాహా.. నాకు నా తల్లిదండ్రులు అలాంటివి నేర్పించలేదు.. అందుకే ఇలా!

22 Feb, 2022 11:31 IST|Sakshi

Wriddhiman Saha Comments: టీమిండియా హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌పై వ్యాఖ్యలు, జర్నలిస్టు బెదిరింపులు అంటూ ట్వీట్‌తో వార్తల్లోకెక్కిన భారత వెటరన్‌ వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా ఎట్టకేలకు మౌనం వీడాడు. సదరు జర్నలిస్టు పేరు బయటపెట్టకపోవడం వెనుక కారణాన్ని వెల్లడించాడు. ఈ మేరకు సాహా సోమవారం జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇంతవరకు బీసీసీఐ నుంచి నాతో ఎవరూ కమ్యూనికేట్‌ చేయలేదు. ఒకవేళ వాళ్లు అడిగితే తప్పకుండా ఆ జర్నలిస్టు పేరు బయటపెడతా. 

నిజానికి ఓ వ్యక్తి ప్రతిష్టను దిగజార్చడం, అభాసుపాలు చేయడం.. కెరీర్‌ను ఇబ్బందుల్లోకి నెట్టడం నాకు ఇష్టం ఉండదు. ఇతరకులకు హాని చేయాలన్న ఆలోచన ఉండదు. నా తల్లిదండ్రులు నాకు నేర్పింది ఇదే. అందుకే నా ట్వీట్‌లో ఆ వ్యక్తి పేరు ప్రస్తావించలేదు. అయితే, మీడియాలో కొంతం మంది వ్యక్తులు ఆటగాళ్లను ఎలా అగౌరవపరుస్తారో బయట ప్రపంచానికి తెలియాలన్న తలంపుతోనే ఆ ట్వీట్‌ చేశాను’’ అని అన్నాడు. అదే విధంగా... ‘‘ఈ పని ఎవరు చేశారో వాళ్లకు బాగా తెలుసు. 

నాలాగా ఇతర ఆటగాళ్లకు ఇలాంటి ఇబ్బందులు ఎదురుకాకూడదనే ఆ ట్వీట్లు చేశాను. ఇలా చేయడం వల్ల ఇంకోసారి సదరు వ్యక్తి ఇలాంటి తప్పులు చేయకూడదనేదే నా ఉద్దేశం’’ అని సాహా చెప్పుకొచ్చాడు. కాగా శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ఎంపిక కాని సాహా.. కోచ్‌ ద్రవిడ్‌ తనకు రిటైర్మెంట్‌ సలహా ఇచ్చాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఓ జర్నలిస్టు తనను బెదిరించాడంటూ అతడి నుంచి తనకు వచ్చిన మెసేజ్‌ స్క్రీన్‌షాట్లను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఈ విషయంపై దృష్టి సారించిన బీసీసీఐ విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సాహాను వివరణ కోరనున్నట్లు బీసీసీఐ కోశాధికారి అరుణ్‌ ధుమాల్‌ పీటీఐతో పేర్కొన్నారు.

చదవండి: Saha-Journalist Row: బీసీసీఐ సంచ‌ల‌న నిర్ణ‌యం..!
Rahul Dravid-Wriddhiman Saha: సాహా వ్యాఖ్యలపై స్పందించిన ద్రవిడ్‌... అతడంటే నాకు గౌరవం ఉంది.. కానీ కాస్త..

మరిన్ని వార్తలు