Sania Mirza: ఫేర్‌వెల్‌ మ్యాచ్‌ అనంతరం కంటతడి పెట్టిన సానియా మీర్జా

5 Mar, 2023 14:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవలే ప్రొఫెషనల్‌ టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పిన భారత స్టార్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా, హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఇవాళ (మార్చి 5) జరిగిన ఫేర్‌వెల్‌ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లో పాల్గొంది. సింగిల్స్‌ విభాగంలో రోహన్‌ బోపన్నతో జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా విజయం సాధించింది. మ్యాచ్‌ అనంతరం ఒక్కసారిగా భావోద్వేగానికి లోనైన సానియా.. తన 20 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టింది. ఈ సందర్భంగా సానియా కొడుకు అమ్మ గ్రేట్ అంటూ తన ప్రేమను వ్యక్తం చేయడంతో స్టేడియం మొత్తం హర్షద్వానాలు మార్మోగింది. అనంతరం సానియా మిక్సడ్‌ డబుల్స్‌ మ్యాచ్‌ కూడా ఆడనుంది. ఈ మ్యాచ్‌లో రోహన్‌ బోపన్నతో జతకట్టనున్న సానియా.. ఇవాన్ డోడిక్, మ్యాటెక్ సాండ్స్ జోడీతో తలపడనుంది. 

సానియా ఆడే చివరి మ్యాచ్‌ చూసేందుకు క్రీడారంగానికి చెందిన వారితో పాటు టాలీవుడ్‌, బాలీవుడ్‌, ఇతర రంగాలకు చెందిన సెలబ్రిటీలు ఎల్బీ స్టేడియంకు చేరుకున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజహారుద్దీన్‌, సిక్సర్ల కింగ్‌ యువరాజ్‌ సింగ్‌, సీతారమం ఫేమ్‌ దుల్కర్‌ సల్మాన్‌ ఈ ఈవెంట్‌లొ సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇవాళ సాయంత్రం ఓ ప్రైవేట్ హోటల్‌లో జరిగే రెడ్ కార్పెట్ ఈవెంట్‌కు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, హీరోలు మహేష్ బాబు, అల్లు అర్జున్, ఏ ఆర్ రెహమాన్, సురేష్ రైనా, జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్‌తో తోపాటు మరికొందరు స్పోర్ట్స్, సినిమా స్టార్స్ హాజరుకానున్నారని సమాచారం. 

కాగా, సానియా తన 20 ఏళ్ల ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ కెరీర్‌లో 6 గ్రాండ్ స్లామ్ టైటిల్స్, 43 WTA టైటిల్స్‌, ఏసియన్ గేమ్స్ లో 8 పతకాలు, కామన్వెల్త్ గేమ్స్ లో 2 మెడల్స్ సాధించిన విషయం తెలిసిందే. ఈ హైదరాబాదీ క్వీన్‌ డబుల్స్ లో 91 వారాల పాటు వరల్డ్ నెంబర్ వన్ ర్యాంక్‌లో కొనసాగింది. భారత టెన్నిస్‌కు సేవలందించినందకు గాను సానియాకు అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్ రత్న తోపాటు అర్జున, పద్మ భూషణ్, పద్మ శ్రీ అవార్డులు లభించాయి. సానియా ప్రస్తుతం మహిళల ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్  టీమ్‌కు మెంటర్‌గా వ్యవహరిస్తుంది. 


 
 

మరిన్ని వార్తలు