తిలక్‌ వర్మ కెప్టెన్సీ అదుర్స్‌.. సంచలన విజయం! ముంబైకి షాక్‌.. అగ్రస్థానంలో..

26 Oct, 2023 12:07 IST|Sakshi

Syed Mushtaq Ali Trophy 2023- Hyderabad won by 23 runs: సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్‌ టోర్నీలో హైదరాబాద్‌ జట్టు సంచలనం సృష్టించింది. రహానే సారథ్యంలోని డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై జట్టును తిలక్‌ వర్మ కెప్టెన్సీలోని హైదరాబాద్‌ జట్టు 23 పరుగుల తేడాతో ఓడించింది. ఈ టోర్నీలో హైదరాబాద్‌కిది ఐదో విజయం.

జైపూర్‌లో బుధవారం జరిగిన గ్రూప్‌ ‘ఎ’ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ కు దిగిన హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 155 పరుగులు చేసింది. తన్మయ్‌ అగర్వాల్‌ (46 బంతుల్లో 59; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), రాహుల్‌ సింగ్‌ (26 బంతుల్లో 37; 4 ఫోర్లు), చందన్‌ సహని (23 బంతుల్లో 29; 1 ఫోర్, 1 సిక్స్‌) రాణించారు.

కెప్టెన్‌ తిలక్‌ వర్మ (6), రోహిత్‌ రాయుడు (8) తక్కువ స్కోరుకే అవుటయ్యారు. అనంతరం 156 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులు చేసి ఓడిపోయింది.

మీడియం పేసర్‌ రవితేజ 32 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా... తిలక్‌ వర్మ 2 వికెట్లు తీసి ముంబై జట్టును దెబ్బ కొట్టారు.  ప్రస్తుతం ముంబై, హైదరాబాద్, బరోడా జట్లు 20 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి.  

చదవండి: BCCI: టీమిండియా హెడ్‌కోచ్‌గా రాజస్తాన్‌ రాయల్స్‌ మాజీ కోచ్‌

మరిన్ని వార్తలు