ముంబైకు చుక్కెదురు

3 Nov, 2023 01:14 IST|Sakshi

ముల్లన్‌పూర్‌ (చండీగఢ్‌): సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై జట్టు కథ క్వార్టర్‌ ఫైనల్లో ముగిసింది. గురువారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో బరోడా జట్టు మూడు వికెట్ల తేడాతో ముంబైను ఓడించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ముందుగా ముంబై 20 ఓవర్లలో 8 వికెట్లకు 148 పరుగులు చేసింది. శివమ్‌ దూబే (36 బంతుల్లో 48; 1 ఫోర్, 3 సిక్స్‌లు), సర్భరాజ్‌ ఖాన్‌ (22 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు.

అనంతరం బరోడా జట్టు 18.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసి నెగ్గింది. విష్ణు సోలంకి (30 బంతుల్లో 49 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) బరోడా జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇతర క్వార్టర్‌ ఫైనల్స్‌లో పంజాబ్‌ ఐదు వికెట్ల తేడాతో ఉత్తరప్రదేశ్‌పై, ఢిల్లీ 39 పరుగుల తేడాతో విదర్భ జట్టుపై, కేరళ జట్టుపై అస్సాం ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీఫైనల్‌ చేరుకున్నాయి. 
 

మరిన్ని వార్తలు