SMAT 2023: సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ విజేతగా పంజాబ్‌..

6 Nov, 2023 21:26 IST|Sakshi

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ-2023 విజేతగా పంజాబ్‌ జట్టు నిలిచింది. సోమవారం మొహాలీ వేదికగా జరిగిన ఫైనల్లో బరోడాను ఓడించిన పంజాబ్‌.. తొలిసారి టైటిల్‌ను ముద్దాడింది. 224 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బరోడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 203 పరుగులు మాత్రమే చేయగల్గింది. బరోడా బ్యాటర్లలో అభిమన్యు సింగ్(61), కెప్టెన్‌ కృనాల్‌ పాండ్యా(45) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ జట్టును గెలిపించలేకపోయారు.

పంజాబ్‌ బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌ 4 వికెట్లతో అదరగొట్టగా.. కౌల్‌, బ్రార్‌, మార్కండే తలా వికెట్‌ సాధించారు. ఇక తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 4 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో అన్మోల్‌ప్రీత్ సింగ్ మెరుపు సెంచరీతో చెలరేగాడు.

61 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో 113 పరుగులు చేశాడు. అతడితో పాటు వాదేరా(61) పరుగులతో ఆఖరిలో అదరగొట్టాడు. అతడి ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61 పరుగులు చేశాడు. బరోడా బౌలర్లలో కృనాల్‌ పాండ్యా, సోపారియా, సేథ్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.
 

మరిన్ని వార్తలు