సుతీర్థ–ఐహిక జోడీ ఓటమి 

9 Sep, 2023 03:01 IST|Sakshi

ప్యాంగ్‌చాంగ్‌ (దక్షిణ కొరియా): ఆసియా టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) చాంపియన్‌షిప్‌ వ్యక్తిగత విభాగాల్లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో మానవ్‌ ఠక్కర్‌ 9–11, 10–12, 5–11తో చైనా దిగ్గజం మా లాంగ్‌ చేతిలో పోరాడి ఓడిపోయాడు. మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్‌లో సుతీర్థ 9–11, 6–11, 4–11తో ఒరావన్‌ పరానాంగ్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో... ఐహిక ముఖర్జీ 11–2, 11–6, 8–11, 9–11, 3–11తో చెన్‌ జింగ్‌టాంగ్‌ (చైనా) చేతిలో పరాజయం చవిచూశారు.

మహిళల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సుతీర్థ ముఖర్జీ–ఐహిక ముఖర్జీ (భారత్‌) జోడీ 5–11, 11–13, 10–12తో మాన్యు వాంగ్‌–చెన్‌ మెంగ్‌ (చైనా) ద్వయం చేతిలో... పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో మానవ్‌ ఠక్కర్‌–మనుష్‌ షా (భారత్‌) జంట 5–11, 3–11, 5–11తో ఫాన్‌ జెన్‌డాంగ్‌–లిన్‌ గావోయువాన్‌ (చైనా) జోడీ చేతిలో ఓడిపోయాయి. టీమ్‌ విభాగంలో భారత పురుషుల జట్టు కాంస్య పతకం నెగ్గగా... మహిళల జట్టుకు ఆరో స్థానం లభించింది.   

మరిన్ని వార్తలు