Pujara-Rahane: రహానే, పుజారాలు జట్టులోకి రావడం కష్టమే: మాజీ క్రికెటర్‌

22 Feb, 2022 12:58 IST|Sakshi

టీమిండియా సీనియర్‌ ఆటగాళ్లు అజింక్యా రహానే, చతేశ్వర్‌ పుజారాలు జట్టు నుంచి ఉద్వాసనకు గురైన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఫామ్‌ కోల్పోయి సతమతమవుతున్న ఈ ఇద్దరిపై బీసీసీఐ వేటు వేసింది. శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు రహానే, పుజారాలను పరిగణలోకి తీసుకోలేదు. ప్రస్తుతం రంజీ సీజన్‌లో ఆడుతున్న ఈ ఇద్దరు తిరిగి జట్టులోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ ఆసక్తికరవ్యాఖ్యలు చేశాడు.

''ఒకటిన్నర దశాబ్దంపాటు రహానే, పుజారాలు టీమిండియా టెస్టు క్రికెట్‌లో కీలకపాత్ర పోషించారు. మిడిలార్డర్‌లో వీరిద్దరు కలిసి టీమిండియాకు ఎన్నో మంచి ఇన్నింగ్స్‌లు ఆడారు. అయితే ప్రస్తుతం ఫామ్‌ కోల్పోయి జట్టుకు దూరమయ్యారు.రంజీల్లో ఆడుతూ ఫామ్‌ పుణికిపుచ్చుకొని మళ్లీ జట్టులోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ అది కష్టతరమే అనిపిస్తుంది. సౌతాఫ్రికా టూర్‌లో మూడు టెస్టుల సిరీస్‌లో ఈ ఇద్దరిలో ఒక్కరు ఒక ఇన్నింగ్స్‌లో సెంచరీ లేదంటే 80-90 పరుగులు చేసినా పరిస్థితి వేరుగా ఉండేది. రహానే ఈ విషయంలో కాస్త మెరుగ్గా ఉన్నప్పటికి సిరీస్‌ గెలవడంలో అది ఉపమోగపడలేదు.

చదవండి: మౌనం వీడిన సాహా.. నాకు నా తల్లిదండ్రులు అలాంటివి నేర్పించలేదు

ఇప్పటికి వారు తిరిగొస్తారా అంటే ఆ చాన్స్‌ కూడా ఉంది. రంజీ సీజన్‌లో ఈ ఇద్దరు స్థిరంగా 200- 250 పరుగులు చేస్తే కచ్చితంగా జట్టులోకి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే శ్రీలంకతో టెస్టు సిరీస్‌ తర్వాత టీమిండియా ఒకే ఒక్క టెస్టు ఆడనుంది. అది ఇంగ్లండ్‌ గడ్డపై. ఈ గ్యాప్‌లో ఐపీఎల్‌తో పాటు.. టి20 వరల్డ్‌కప్‌ జరగనుంది. దీంతో ఈ ఏడాది రహానే, పుజారాలు మళ్లీ టీమిండియాలో కనిపించే అవకాశాలు లేవు. ఇక వచ్చే ఏడాది చూసుకుంటే వీరిద్దరికి ఇప్పటికే 30 ప్లస్‌ వయసు ఉండడం.. వీరి స్థానాల్లో కొత్త ఆటగాళ్లను పరీక్షించే అవకాశం ఉంది. ఒకవేళ యువ ఆటగాళ్లు సత్తా చాటితే పుజారా, రహానేలకు దాదాపు దారులు మూసుకుపోయినట్లే. ఇప్పటికే ఇషాంత్‌ శర్మ, వృద్ధిమాన్‌ సాహాల కెరీర్‌ ముగిసినట్లేనని బీసీసీఐ పరోక్షంగా సంకేతాలు పంపింది.'' అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక రంజీ సీజన్‌లో రహానే ముంబై తరపున, పుజారా సౌరాష్ట్ర తరపున బరిలోకి దిగారు. ముంబై తరపున సూపర్‌ సెంచరీతో రహానే సత్తా చాటగా.. అటు పుజారా సౌరాష్ట్ర తరపున 91 పరుగులతో రాణించాడు. శ్రీలంకతో టీమిండియా మొదట మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ ఆడనుంది.మొదటి టి20 ఈ నెల 24న లక్నోలో జరుగుతుంది. మిగతా రెండు మ్యాచ్‌లు 26, 27 తేదీల్లో ధర్మశాలలో జరుగనున్నాయి. ఆ తర్వాత రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొహలీ వేదికగా తొలి టెస్టు(మార్చి 4 నుంచి 8 వరకు), బెంగళూరు వేదికగా రెండో టెస్టు(మార్చి 12 నుంచి 16 వరకు) జరగనుంది. 

చదవండి: IPL 2022: రూ. 6.5 కోట్లే దండగ.. మళ్లీ వైస్‌ కెప్టెన్సీనా!? ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్యాన్స్‌ గరం

మరిన్ని వార్తలు