Afghanistan: ఏం పర్లేదు.. తాలిబన్లు క్రికెట్‌ను ప్రేమిస్తారు, మద్దతిస్తారు

17 Aug, 2021 10:04 IST|Sakshi

కాబుల్‌: రెండు దశాబ్దాల తర్వాత అఫ్గనిస్తాన్‌లో మరోమారు తాలిబన్లు పాలనా పగ్గాలు చేపట్టడంతో  అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాచరిక​ పాలన కొనసాగించే తాలిబన్లకు భయపడుతున్న ప్రజలు కట్టుబట్టలతో దేశం విడిచి పారిపోతున్నారు. ఈ నేపథ్యంలో అఫ్గన్‌ భవితవ్యం ఎంటనేది ప్రశ్నర్థకంగా మారింది. ఇక క్రికెట్‌లో కూడా అఫ్గన్‌ ఇప్పుడిప్పుడే పటిష్టంగా తయారవుతుంది. అయితే తాలిబన్ల రాకతో అఫ్గన్‌ క్రికెట్‌కు వచ్చిన ప్రమాదమేమి లేదని ఆఫ్గనిస్తాన్‌ క్రికెట్‌ సీఈవో హమీద్‌ షిన్వరీ తెలిపాడు.

పీటీఐకి ఇచ్చిన ఇంటర్య్వూలో హమీద్‌ మాట్లాడుతూ.. '' తాలిబన్లు క్రికెట్‌ను ప్రేమిస్తారు.. వాళ్లు ఆటకు కూడా మద్దతిస్తారు. వాళ్లు మా ఆటకు అభ్యంతరం చెప్పరనే భావిస్తున్నాం. ఇక దేశంలోని క్రికెటర్లకు మా భరోసా పూర్తిగా ఉంటుంది. ప్రస్తుతం స్టార్‌ క్రికెటర్లు రషీద్‌ ఖాన్‌, మహ్మద్‌ నబీ, ముజీబ్‌ జర్దన్‌లు యూకేలో ఉన్నారు. హండ్రెడ్‌ టోర్నమెంట్‌లో బిజీగా ఉన్న వాళ్లు తమ కుటుంబసభ్యుల గురించి ఆందోళన పడుతున్నారు. ఈ విషయం గురించి ఆందోళన అవసరం లేదు.. క్రికెటర్ల కుటుంబాలను కాపాడే బాధ్యత మాది.''  అంటూ చెప్పుకొచ్చాడు. కాగా సెప్టెంబర్‌ 1 నుంచి పాకిస్తాన్‌, అఫ్గనిస్తాన్‌ల మధ్య జరగనున్న టీ20 సిరీస్‌ ప్రశ్నార్థకంగా మారింది. 

ఇక  సెప్టెంబర్‌ 19 నుంచి ప్రారంభంకానున్న లీగ్‌లో త‌మ జట్టుకు ఆడాల్సిన ర‌షీద్ ఖాన్‌, మ‌హ్మద్ న‌బీలు అందుబాటులో ఉంటార‌ని స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ సోమ‌వారం ప్రక‌టించింది. ఓ ప్రముఖ న్యూస్‌ ఏజన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్రాంఛైజీ సీఈవో ష‌ణ్ముగం మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌లో ఏం జ‌రుగుతుందన్న దానిపై మేము మాట్లాడ‌దలుచుకోలేదు. అయితే, తమ జట్టుకు ప్రాతినిధ్యం వహించే ఆ దేశ క్రికెటర్లు మాత్రం లీగ్‌కు అందుబాటులో ఉంటారని చెప్పగలనని పేర్కొన్నారు.


 

మరిన్ని వార్తలు