11 పరుగులు.. 4 వికెట్లు

18 Dec, 2020 10:17 IST|Sakshi

అడిలైడ్‌ : ఆసీస్‌తో జరుగుతున్న పింక్‌ టెస్టులో టీమిండియా 244 పరుగులకే ఆలౌట్‌ అయింది. 233/6 స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన కోహ్లి సేన క్రితం రోజు స్కోరుకు మరో 11 పరుగులు మాత్రమే జత చేసింది. అశ్విన్‌, సాహాలు క్రీజులో ఉండడంతో టీమిండియా 300 మార్కును సులభంగా దాటుందని అంతా భావించారు. కానీ పిచ్‌పై ఉన్న పచ్చికను సద్వినియోగం చేసుకున్న స్టార్క్‌, కమిన్స్‌లు రెచ్చిపోయారు. రెండో రోజు కమిన్స్‌ వేసిన తొలి ఓవర్‌ మూడో బంతికే రవిచంద్రన్‌ అశ్విన్‌(15 పరుగులు) క్యాచ్‌ అవుట్‌గా వెనుదిరిగాడు. తర్వాతి ఓవర్లో 9 పరుగులు చేసిన సాహాను స్టార్క్‌ పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ఉమేశ్‌ యాదవ్‌, షమీలు వీరిద్దరి దాటికి ఎక్కువసేపు నిలవలేకపోయారు.  అంతకుముందు తొలి రోజు ఆటలో కోహ్లి (180 బంతుల్లో 74; 8 ఫోర్లు), పుజారా (160 బంతుల్లో 43; 2 ఫోర్లు), రహానే (92 బంతుల్లో 42; 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. ఆసీస్‌ బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌ 4.. పాట్‌ కమిన్స్‌ 3 వికెట్లతో రాణించారు. 

మరిన్ని వార్తలు