రోహిత్‌ శర్మ హాఫ్‌ సెంచరీ.. నిలకడగా టీమిండియా

12 Aug, 2021 19:05 IST|Sakshi

లండన్‌: ఇంగ్లండ్‌తో ఇక్కడ లార్డ్స్‌ వేదికగా జరుగుతున్న  రెండో టెస్టులో టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ హాఫ్‌ సెంచరీ సాధించాడు. 83 బంతుల్లో అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు. ఈరోజు(గురువారం) ఆరంభమైన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దాంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఇన్నింగ్స్‌ను రోహిత్‌ శర్మ-కేఎల్‌ రాహుల్‌లు ప్రారంభించారు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళుతున్నారు.

రోహిత్‌ కాస్త దూకుడగా ఆడినా, కేఎల్‌ రాహుల్‌ అత్యంత సంయమనంతో ఆడుతున్నాడు. 74  బంతుల్లో రాహుల్‌ 15 పరుగులు చేశాడు. 27 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్‌ నష్టపోకుండా 78 పరుగులు చేసింది. కాగా, ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. భారత్‌ గెలిచే అవకాశం ఉన్న ఆ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కల్గించడంతో డ్రా అయ్యింది. టీమిండియా-ఇంగ్లండ్‌ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌ జరుగనున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు