Syed Musthaq Ali T20: తిలక్‌ వర్మ జోరు.. హైదరాబాద్‌కు హ్యాట్రిక్‌ విజయం

17 Oct, 2022 07:59 IST|Sakshi

జైపూర్‌: ముస్తాక్‌ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్‌ టోర్నీలో హైదరాబాద్‌ మూడో విజయం నమోదు చేసింది. త్రిపుర జట్టుతో జరిగిన గ్రూప్‌ ‘బి’ నాలుగో లీగ్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. యువ బ్యాటర్‌ తిలక్‌ వర్మ తన అద్భుతమైన ఫామ్‌ కొనసాగిస్తూ వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ అర్ధ సెంచరీ సాధించాడు. త్రిపుర నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్‌ సరిగ్గా 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

తిలక్‌ వర్మ 46 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 67 పరుగులు చేశాడు. మికిల్‌ జైస్వాల్‌ (21 బంతుల్లో 32; 1 ఫోర్, 2 సిక్స్‌లు), తనయ్‌ త్యాగరాజన్‌ (11 బంతుల్లో 24 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా ధాటిగా ఆడి హైదరాబాద్‌ విజయానికి బాటలు వేశారు. అంతకుముందు త్రిపుర 20 ఓవర్లలో 8 వికెట్లకు 158 పరుగులు చేసింది. రవితేజ, తనయ్‌ త్యాగరాజన్‌ రెండేసి వికెట్లు తీశారు.    

మరిన్ని వార్తలు