Tokyo Olympics: సెమీస్‌లో పీవీ సింధుకు కఠిన సవాల్‌? ప్రత్యర్థి తైజుయింగ్‌

30 Jul, 2021 19:41 IST|Sakshi

టోక్యోటోక్యో ఒలింపిక్స్‌లో వరుస విజయాలతో దూసు​కుపోతున్న పీవీ సింధుకు సెమీఫైనల్‌లో ప్రపంచ నెంబర్ వన్‌ తైజుయింగ్‌ (చైనీస్‌ తైపీ) రూపంలో కఠిన సవాల్‌ ఎదురుకానుంది. ఎందుకంటే ఇప్పటివరకు సింధు, తైజుయింగ్‌తో 18 సార్లు తలపడగా కేవలం ఐదు సార్లు మాత్రమే విజయం సాధించింది. మరోవైపు ఈ ఏడాదిలో ఇప్పటివరకు 15 మ్యాచ్‌లు ఆడిన తైజుయింగ్‌ అద్భుత ప్రదర్శలతో 12 మ్యాచుల్లో విజయం సాధించింది. కేవలం మూడు మ్యాచ్‌ల్లోనే ఓడిపోయింది.

తన కేరీర్‌లో మెత్తం 558 మ్యాచ్‌ల్లో 406 గెలిచిన తైజుయింగ్‌ ప్రపంచ నెంబర్ వన్‌ స్ధానంలో కొనసాగుతోంది. అయితే ఇప్పటివరకు తైజుయింగ్‌ ఒలింపిక్స్‌లో ఒక్క పతకం కూడా గెలుచుకోలేదు.ఇది సింధుకు కాస్త ఊరటనిచ్చే విషయం. ముఖ్యంగా లండన్‌, రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న తైజుయింగ్‌ కనీసం క్వార్టర్‌ ఫైనల్స్‌ కూడా చేరకపోవడం గమనార్హం.

ముఖ్యంగా రియో ఒలింపిక్స్‌లో సింధు చేతిలో ఆమె ఓటమి పాలైంది. 2020 ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో సింధును ఓడించి తైజుయింగ్‌ రియో ఒలింపిక్స్‌కు ప్రతీకారం తీర్చుకుంది. ఈ ఇద్దరి మధ్య శనివారం జరగనున్న సెమీఫైనల్‌ పోరుకై ఇరు దేశాల అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎవరిది పైచేయి అవుతుందో మరి కొన్ని గంటల్లో తేలనుంది.

మరిన్ని వార్తలు