కోవిడ్‌ పరీక్షల్లో ఇంగ్లండ్‌ జట్టు మొత్తానికి నెగిటివ్‌

1 Feb, 2021 18:17 IST|Sakshi

సాక్షి, చైన్నై: భారత పర్యటనలో భాగంగా కరోనా పరీక్షలు చేయించుకున్న ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టుకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. స్టాఫ్‌తో సహా జట్టు సభ్యులందరికీ కరోనా పరీక్షల్లో నెగిటివ్‌గా తేలింది. ఇటీవల శ్రీలంక పర్యటనను ముగించుకొని నేరుగా భారత్‌కు చేరుకున్న ఇంగ్లండ్‌ జట్టు ఆరు రోజుల పాటు క్వారంటైన్‌లో గడిపింది. ఈ ఆరు రోజుల క్వారంటైన్‌ సెషన్‌లో ఇంగ్లండ్‌ జట్టు సభ్యులందరికీ మూడు సార్లు కరోనా పరీక్షలు నిర్వహించగా, సభ్యులందరికీ మూడింటిలో నెగిటివ్‌గా తేలింది. దీంతో ఊపిరి పీల్చుకున్న ఇంగ్లండ్‌ జట్టుకు, ఈనెల 5న ప్రారంభంకానున్న తొలి టెస్ట్‌కు ముందు మూడు రోజులు ప్రాక్టీస్‌ చేసే అవకాశం లభించింది. 

ఇంగ్లీష్‌ జట్టు మొత్తం రేపు మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు సాగే తొలి ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొంటారు. కాగా, జట్టుతో పాటు శ్రీలంక పర్యటనకు వెళ్లని ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌, జోఫ్రా ఆర్చర్‌, రాయ్‌ బన్స్‌లు కొద్ది రోజుల కిందటే భారత్‌కు చేరుకొని(క్వారంటైన్‌ ముగించుకొని) ప్రాక్టీస్‌ను మొదలు పెట్టారు. ఈ ముగ్గురు ఆటగాళ్లు కూడా రేపటి ప్రాక్టీస్‌ సెషన్‌లో జట్టుతో కలుస్తారు. మరోవైపు భారత ఆటగాళ్లు కూడా క్వారంటైన్‌ సెషన్‌ను ముగించుకొని, రేపటి ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొనేందుకు సిద్దమయ్యారు. 

ఇరు జట్ల మధ్య జరిగే తొలి రెండు టెస్టులకు(ఫిబ్రవరి 5, ఫిబ్రవరి 13) చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదిక కానుండగా, మూడు(ఫిబ్రవరి 24), నాలుగు(మార్చి 4) టెస్టులు అహ్మదాబాద్‌లోని సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో జరుగనున్నాయి. ఆతరువాత ప్రారంభమయ్యే 5 టీ20 మ్యాచ్‌లకు(మార్చి 12,14,16,18,20) కూడా అహ్మదాబాద్‌లోని సర్దార్‌ పటేల్‌ స్టేడియమే వేదిక కానుంది. ఆతరువాత ఇరు జట్ల మధ్య జరిగే 3 వన్డే మ్యాచ్‌లకు(మార్చి 23, 26, 28) పూణేలోని మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియం వేదిక కానుంది. 

మరిన్ని వార్తలు