శార్దూల్‌ మెరుపులు.. సెంచరీ మిస్‌!

1 Mar, 2021 16:44 IST|Sakshi
శార్దూల్‌ ఠాకూర్‌(ఫోటో కర్టసీ: బీసీసీఐ)

శార్దూల్‌  చేజారిన తొలి సెంచరీ 

రాణించిన సూర్యకుమార్, తారే

జైపూర్‌: విజయ్‌ హజరా ట్రోఫీలో ముంబైకి ఆడుతున్న శార్దూల్‌ ఠాకూర్‌ రెచ్చిపోయి ఆడాడు. హిమచల్‌ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శార్దూల్‌ బ్యాటింగ్‌లో విజృంభించాడు. శ్రేయస్‌ అయ్యర్(2)‌, పృథ్వీ షా(2)లు విఫలమైనప్పటికీ శార్దూల్‌ మాత్రం బ్యాటింగ్‌ పవర్‌ చూపించాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన శార్దూల్‌ మెరుపు బ్యాటింగ్‌ చేశాడు. బౌండరీలే లక్ష్యంగా చెలరేగి పోయిన శార్దూల్‌.. ఈ వన్డే మ్యాచ్‌లో శార్దూల్‌ 57 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 92 పరుగులు సాధించాడు. బౌలర్లపై ఎదురుదాడికి దిగి విధ్వంసక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. కాగా, సెంచరీకి ఎనిమిది పరుగుల దూరంలో శార్దూల్‌ పెవిలియన్‌ చేరాడు.

ఫలితంగా లిస్గ్‌-ఎ క్రికెట్‌లో తొలి సెంచరీ చేసుకునే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.  ఇది శార్దూల్‌కు లిస్ట్‌-ఎ క్రికెట్‌లో తొలి హాఫ్‌ సెంచరీగా నమోదైంది, శార్దూల్‌ మెరుపులతో ముందుగా బ్యాటింగ్‌ చేసిన ముంబై 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. అతనికి జతగా సూర్యకుమార్‌ యాదవ్‌(91; 75 బంతుల్లో 15 ఫోర్లు), ఆదిత్యా తారే(83; 98 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌)లు రాణించడంతో ముంబై  మూడొందలకు పైగా స్కోరు చేసింది.

అనంతరం బ్యాటింగ్‌ చేసిన హిమాచల్‌ ప్రదేశ్‌ 24.1 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటైంది. హిమాచల్‌ ప్రదేశ్‌ జట్టులో మయాంక్‌ దాగర్‌(38 నాటౌట్‌) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు సాధించలేదు.ముంబై బౌలర్లలో స్పిన్నర్‌ ప్రశాంత్‌ సోలంకీ నాలుగు వికెట్లతో రాణించి హిమాచల్‌ ప్రదేశ్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ను కకావికలం చేశాడు. ములాని మూడు వికెట్లు సాధించగా, ధావల్‌ కులకర్ణి రెండు వికెట్లు తీశాడు.

ఇక్కడ చదవండి: 
పిచ్‌ ఎలా ఉంటదో: టెన్షన్‌ అవసరం లేదు రోహిత్‌!

మరిన్ని వార్తలు