Shardul Thakur: 'ధోని భయ్యాను చాలా మిస్సవుతున్నాం'

9 Oct, 2022 09:32 IST|Sakshi

రాంచీ అనగానే మొదటగా మనకు గుర్తుకు వచ్చేది టీమిండియా మాజీ క్రికెటర్‌ ఎంఎస్‌ ధోని. టీమిండియాకు రెండు వరల్డ్‌కప్‌లు అందించిన ఏకైక కెప్టెన్‌గా ధోని చరిత్రకెక్కాడు.  తాజాగా రాంచీ వేదికగా ఇవాళ భారత్‌, దక్షిణాఫ్రికాల మధ్య రెండో వన్డే జరగనుంది. తొలి వన్డేలో గెలిచిన సౌతాఫ్రికా 1-0తో ఆధిక్యంలో ఉండగా.. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని టీమిండియా భావిస్తోంది.

ధోని రిటైర్మెంట్‌ అయిన తర్వాత రాంచీలో ఎప్పుడు టీమిండియా మ్యాచ్‌ ఆడినా తప్పకుండా హాజరయ్యేవాడు. కానీ ఈసారి కొన్ని కారణాల వల్ల ధోని ఈ మ్యాచ్‌కు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ధోని సొంత పట్టణంలో మ్యాచ్‌ ఆడుతున్న సందర్భంగా టీమిండియా బౌలర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ స్పందించాడు. ధోని భయ్యాను మిస్‌ అవుతున్నట్లు పేర్కొన్నాడు

"ధోనీని ప్రతి ఒక్కరం మిస్ అవుతున్నాం. జట్టులో అనుభవజ్ఞుడు లేని కొరత కనిపిస్తోంది. అతడు 300 కంటే ఎక్కువగా వన్డేలు, దాదాపు 90 టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. కాబట్టి ఇంత అనుభవం ఉన్న ఆటగాడిని తప్పనిసరిగా మిస్ అవుతాం. ఇలాంటి ఆటగాడు దొరకడం చాలా అరుదు.'' అని పేర్కొన్నాడు.

జట్టులో బౌలర్ల వైఫల్యం గురించి మాట్లాడుతూ.. "ఇక్కడ బౌలర్లు కూడా పరుగులు కోసం కొట్టుకుంటున్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో మన బౌలర్లును విమర్శిస్తే.. ప్రత్యర్థి బౌలర్లను కూడా విమర్శించాలి. ఎందుకంటే మనం సిరీస్ గెలిచాం. అలాగే మీరు నిలకడ గురించి ఆడిగితే.. పిచ్ పరిస్థితులను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. కొన్నిసార్లు వన్డేల్లో 350 కంటే ఎక్కువ పరుగులు నమోదవుతాయి. భారత్ ఎప్పుడూ ఏకపక్షం పోరు ఆడలేదు. ఫైట్ ఎల్లప్పుడూ ఉంటుంది. మేము ఒకటి, రెండు మ్యాచ్‌లు ఓడిపోయి ఉండొచ్చు.. కానీ గరిష్ఠ సంఖ్యలో గెలిచాం. కాబట్టి జట్టులో స్థిరత్వం ఉంది." అని శార్దూల్ అన్నాడు.

ఇక ఎంఎస్ ధోనీ 2020లో తన అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ధోనీ కెప్టెన్సీలో టీమిండియా 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచింది. వీటితో పాటు 2014 టీ20 వరల్డ్‌ కప్‌లో ఫైనల్‌కు చేరి రన్నరప్‌గా నిలిచింది.

చదవండి: తండ్రిగా ప్రమోషన్‌ పొందిన స్పెయిన్‌ బుల్‌

చిన్నారి మరణం.. శోకసంద్రంలో డేవిడ్‌ మిల్లర్‌!

మరిన్ని వార్తలు