ఐపీఎల్‌ కొత్త ఫార్మాట్‌ ఎలా?

7 Dec, 2020 18:04 IST|Sakshi

న్యూఢిల్లీ: వచ్చే ఐపీఎల్‌ సీజన్‌ను పది జట్లతో విస్తరించాలని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) భావిస్తోంది. ఈ నెల 24వ తేదీన జరుగనున్న బీసీసీఐ ఏజీఎం సమావేశంలో ఐపీఎల్‌-2021ని పది జట్లతో నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోవడానికి బోర్డు పెద్దలు ఇప్పటికే సిద్ధమైనట్లే కనబడుతోంది. పది జట్లతో ఐపీఎల్‌ నిర్వహణ బోర్డుకు కొత్తేం కాదు. తొమ్మిదేళ్ల క్రితమే పది జట్లు (పుణే వారియర్స్, కొచ్చి టస్కర్స్‌) ఐపీఎల్‌లో తలపడ్డాయి. అయితే ఈ పది జట్ల ముచ్చట 2013లోనే ముగిసింది. మళ్లీ ఏడేళ్ల తర్వాత  విస్తరణ తెర మీదికొచ్చింది. దీనికి ప్రధాన కారణం అదానీ గ్రూప్‌. గుజరాత్‌కు చెందిన ఈ కార్పొరేట్‌ సంస్థ అహ్మదాబాద్‌ వేదికగా ఫ్రాంచైజీ కోసం ఆసక్తి కనబరుస్తోంది. ఇదివరకే రెండేళ్లు రైజింగ్‌ పుణే ఫ్రాంచైజీ ఉన్న సంజీవ్‌ గోయెంకాకు చెందిన ఆర్పీజీ సంస్థ కూడా తిరిగి వచ్చేందుకు తహతహలాడుతోంది. అయితే ఐపీఎల్ 2021 సీజన్లో ఒక జట్టే బరిలో దిగుతుందని.. ఆ తర్వాతి సీజన్‌లో పదో ఫ్రాంచైజీ బరిలో దిగుతుందని వార్తలొచ్చాయి. ఏదేమైనా ఈసారి అహ్మదాబాద్ ఫ్రాంచైజీ పేరు ఖాయమైందని సమాచారం. (అతనే నాకు స్ఫూర్తి.. ఆ అవార్డు నాకెందుకు?: హార్దిక్‌)

ఇక ప్రస్తుతం పాల్గొనే ఎనిమిది జట్లు రౌండ్ రాబిన్ పద్దతిలో ఒక్కో జట్లతో రెండుసార్లు తలపడుతున్నాయి. దీంతో లీగ్ దశలో ఒక జట్టు 14 మ్యాచ్‌లు ఆడుతుంది. ఐపీఎల్ 2021కి రెండు జట్లు వస్తే.. ఈ పద్దతి ప్రకారం మ్యాచ్‌ల సంఖ్య 18కి చేరుకుంటుంది. అప్పుడు సుదీర్ఘ ఐపీఎల్ సీజన్ అవుతునందేది కాదనలేని వాస్తవం. ఈ ఫార్మాట్ నిర్వహించడం కూడా బీసీసీఐకి పెద్ద తలనొప్పే. అందుకే బీసీసీఐ 2011 ఫార్మాట్‌ను పరిశీలించే అవకాశం ఉంది. 2011లో 10 జట్లు రెండు గ్రూపులుగా విడిపోయాయి. లీగ్ దశలో అన్ని జట్లు 14 మ్యాచ్‌లే ఆడాయి. అలా కాకుండా కొత్త పద్ధతిపై కూడా బీసీసీఐ సమాలోచనలు చేస్తోంది. అన్ని జట్లు లీగ్‌ దశలో 13 మ్యాచ్‌లకే పరిమితం చేయడంపై యోచిస్తోంది. పది జట్లను రెండు గ్రూపులు చేస్తారు. అంటే ఐదేసి జట్లతో ఒక గ్రూపు ఏర్పడుతుంది. ఇక్కడ ఒక్కో జట్టు తన బృందంలోని మరో జట్టుతో రెండు సార్లు తలపడుతుంది. ఆ రెండేసి మ్యాచ్‌లు హోమ్‌ గ్రౌండ్‌లో ఒకటి, బయట ఒకటి జరుగతాయి. అదే సమయంలో అవతలి గ్రూప్‌లోని జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. అంటే లీగ్‌ దశలో ఒక్కో జట్టు 13 మ్యాచ్‌లు ఆడతుందన్నమాట. ఇన్ని అంశాలు పరిశీలనలో ఉండటంతో ఇదంతా గందరగోళంగానే కనిపిస్తోంది. మరి బీసీసీఐ అడుగు ఎలా ఉంటుందో అనేది ఆసక్తికరం. (ధావన్‌.. నేను ధోనిని కాదు: వేడ్‌)

మరిన్ని వార్తలు