పాపం పకోవ్‌స్కీ.. మళ్లీ ఔట్‌!

12 Jan, 2021 21:56 IST|Sakshi

ఏ ముహుర్తానా ఆసీస్‌- భారత్‌ల మధ్య సిరీస్‌ ప్రారంభమైందో తెలియదుగాని ఆది నుంచి చూసుకుంటే ఇరు జట్లలో ఎవరు ఒక ఆటగాడు గాయపడుతూనే వస్తున్నారు. ఇప్పటికే టీమిండియా నుంచి ఆరుగురు కీలక ఆటగాళ్లు గాయాలతో దూరమవగా.. అటు ఆసీస్‌లోనూ గాయాల బెడద వెంటాడుతూనే ఉంది. తాజాగా ఆస్ట్రేలియన్‌ యువ ఓపెనర్‌ విల్‌ పకోవ్‌స్కీ గాయపడిన సంగతి తెలిసిందే. విల్‌ పకోవ్‌స్కీ.. టెక్నిక్‌గా చూస్తే మంచి ప్రతిభావంతుడు. కానీ చిన్నప్పటి నుంచి గాయాలు అతన్ని వేధిస్తూనే ఉన్నాయి. టీమిండియాతో జరిగిన మూడో టెస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఆడిన తొలి టెస్టులోనే రెండు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 64, 8 పరుగులు చేశాడు. (చదవండి: ఏడేళ్ల తర్వాత రీఎంట్రీ.. తొలి మ్యాచ్‌లోనే)

అయితే సిడ్నీ టెస్టులో ఐదో రోజు ఆటలో ఫీల్డింగ్‌ సమయంలో  పకోవ్‌స్కీ  డైవ్‌ చేయగా అతని భుజానికి బలమైన గాయమైంది. అతని భుజం ఎముక పాక్షికంగా పక్కకు జరగడంతో నొప్పితో బాధపడుతున్నాడని.. ప్రస్తుతం అతను విశ్రాంతి తీసుకుంటున్నట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా పేర్కొంది.  దీంతో అతను ఇరు జట్లకు కీలకంగా మారిన బ్రిస్బేన్‌ టెస్టుకు దూరమయ్యే అవకాశం ఉంది. నాలుగో టెస్టు ప్రారంభానికి ముందు అతని ఫిట్‌నెస్‌ను పరీక్షించి నాలుగో టెస్టుకు ఎంపిక చేసే విషయంపై  నిర్ణయం తీసుకుంటామని సీఏ తెలిపింది. కాగా జనవరి 15 నుంచి టీమిండియా- ఆసీస్‌ల మధ్య బ్రిస్బేన్‌ వేదికగా నాలుగో టెస్టు మొదలుకానుంది.(చదవండి: 'ఆస్ట్రేలియా ఫ్లైట్‌ ఎక్కేందుకు నేను సిద్ధం')

>
మరిన్ని వార్తలు