WTC Final: నెట్‌ ప్రాక్టీస్‌లో కోహ్లి.. లండన్‌కు పయనం కానున్న ఆ ఐదుగురు!

30 May, 2023 09:51 IST|Sakshi
డబ్ల్యూటీసీ ఫైనల్‌ కోసం ఉమేశ్‌ యాదవ్‌, సిరాజ్‌, కోహ్లి ప్రాక్టీస్‌ (PC: BCCI)

WTC Final 2023- Ind Vs Aus: లండన్‌: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ కోసం భారత ఆటగాళ్లు ఇంగ్లండ్‌లో కసరత్తు మొదలుపెట్టారు. స్టార్‌ బ్యాటర్‌ కోహ్లి ట్రెయినింగ్‌ సెషన్‌లో పాల్గొన్నాడు. లెఫ్టార్మ్‌ సీమర్‌ ఉనాద్కట్, ఉమేశ్‌ యాదవ్, సిరాజ్, వెటరన్‌ స్పిన్నర్‌ అశ్విన్‌లు కాసేపు ఎక్సర్‌సైజ్‌ చేశారు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, యువ సంచలనం యశస్వి జైస్వాల్‌ తాజాగా ఇంగ్లండ్‌ చేరుకోగా... మంగళవారం నుంచి వీరిద్దరు ప్రాక్టీస్‌ మొదలుపెడతారు.  

కాగా జూన్‌ 7-11 వరకు ఇంగ్లండ్‌ వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్‌ జరుగనుంది. టీమిండియా- ఆస్ట్రేలియా ప్రఖ్యాత ఓవల్‌ మైదానంలో ఈ మెగా మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఇప్పటికే ఇరు దేశాల బోర్డులు ఫైనల్‌కు సంబంధించిన జట్లను ఖరారు చేశాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు భారత ఆటగాళ్లు లండన్‌కు చేరకుని ప్రాక్టీస్‌ షురూ చేశారు.

ఐదోసారి చాంపియన్‌గా చెన్నై.. ఆలస్యంగా ఆ ఐదుగురు
ఇక ఐపీఎల్‌-2023 ఫైనల్‌ ముగించుకున్న ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (సీఎస్‌కే), అజింక్య రహానే(సీఎస్‌కే) సహా గుజరాత్‌ టైటాన్స్‌ ఆటగాళ్లు మహ్మద్‌ షమీ, శుబ్‌మన్‌ గిల్‌, కేఎస్‌ భరత్‌ కాస్త ఆలస్యంగా యూకేకు బయల్దేరనున్నారు. కాగా క్యాష్‌ రిచ్‌ లీగ్‌ పదహారో ఎడిషన్‌ విజేతగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ అవతరించిన విషయం తెలిసిందే.

వర్షం ఆటంకం కారణంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సోమవారం జరిగిన రిజర్వ్‌ డే మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గుజరాత్‌ టైటాన్స్‌పై గెలుపొందింది. డక్‌వర్త్‌ లూయీస్‌ పద్ధతిలో విజయం సాధించి ఐదోసారి ట్రోఫీని ముద్దాడింది ధోని సేన.

డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆస్ట్రేలియా జట్టు ఇదే
భారత జట్టుతో వచ్చే నెల 7 నుంచి 11 వరకు ఓవల్‌లో జరిగే ప్రపంచ టెస్ట్‌ చాంపియన్‌ షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ మ్యాచ్‌లో పాల్గొనే ఆస్ట్రేలియా జట్టును ప్రకటించారు.పక్కటెముకల్లో నొప్పితో ఐపీఎల్‌ టోర్నీ మధ్యలో నుంచి స్వదేశానికి వెళ్లిపోయిన పేస్‌ బౌలర్‌ జోష్‌ హాజల్‌వుడ్‌ (ఆర్‌సీబీ)కు 15 మందితో కూడిన ఆసీస్‌ జట్టులో చోటు లభించింది.

అయితే ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌, బ్యాటర్‌ రెన్‌షాలకు స్థానం దక్కలేదు. 32 ఏళ్ల హాజల్‌వుడ్‌ 59 టెస్టులు ఆడి 222 వికెట్లు పడగొట్టాడు. 
ఆస్ట్రేలియా టెస్ట్‌ జట్టు: పాట్‌ కమిన్స్‌ (కెప్టెన్‌), వార్నర్, ఉస్మాన్‌ ఖ్వాజా, లబుషేన్, స్టీవ్‌ స్మిత్, ట్రావిస్‌ హెడ్, అలెక్స్‌ క్యారీ, మిచెల్‌ స్టార్క్, హాజల్‌వుడ్, నాథన్‌ లయన్, టాడ్‌ మర్ఫీ, స్కాట్‌ బోలాండ్, కామెరాన్‌ గ్రీన్, మార్కస్‌ హారిస్, ఇంగ్లిస్‌.   

టీమిండియా
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనాద్కట్‌, ఇషాన్‌ కిషన్‌.
స్టాండ్‌ బై ప్లేయర్లు: సూర్యకుమార్‌ యాదవ్‌, యశస్వి జైశ్వాల్‌, ముకేశ్‌ కుమార్‌

చదవండి:  చాంపియన్‌గా చెన్నై.. గిల్‌ సరికొత్త చరిత్ర! అవార్డులు, ప్రైజ్‌మనీ పూర్తి వివరాలు ఇవే..
రిటైర్మెంట్‌ ప్రకటనకు ఇదే సరైన సమయం.. కానీ! నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి: ధోని
ఇలా జరగాలని రాసి పెట్టి ఉందంతే! ధోని చేతిలో ఓడినా బాధపడను: హార్దిక్‌

మరిన్ని వార్తలు