టీమిండియా అభిమాని వింత రిక్వెస్ట్‌.. స్పందించిన సోనూ సూద్‌

24 Jun, 2021 21:07 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ రసవత్తరంగా సాగుతున్న వేల, రియల్‌ హీరో సోనూ సూద్‌కు ఓ భారత అభిమాని ట్విటర్‌ వేదికగా ఓ వింత రిక్వెస్ట్‌ పెట్టాడు. న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా ఆ జట్టు కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ అడ్డుగోడలా మారి 177 బంతుల్లో 49 పరుగులు చేసి కివీస్‌కు స్వల్ప ఆధిక్యాన్ని అందించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సాగర్‌ అనే ఓ భారత అభిమాని సోనూ సూద్‌కు చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. ‘హ‌లో సోనూ సూద్.. ద‌య‌చేసి విలియ‌మ్స‌న్‌ను పెవిలియ‌న్‌కు పంపండి’ అంటూ సాగర్‌ చేసిన ట్వీట్ నెట్టింట హల్‌చల్‌ చేసింది. 

కరోనా కష్టకాలంలో ప్రజలు సోనూసూద్‌కు మొర‌పెట్టుకుంటే వాళ్ల కష్టాలు ఎలా దూరమయ్యాయో.. యాధృచ్చికంగా, ఈ అభిమాని కోరిక కూడా అలానే నెరవేరింది. విలియ‌మ్స‌న్ అవుట్ అయ్యాడు. ఆతరువాత సదరు అభిమాని ట్వీట్‌కు స్పందించిన సోనూ భాయ్‌.. 'మ‌న టీమ్‌లో దిగ్గ‌జ ఆట‌గాళ్లున్నారు.. వాళ్ళే అత‌నిని వెన‌క్కు పంపుతారు... చూడు విలియ‌మ్స‌న్ అవుటైపోయాడు' అంటూ ట్వీట్ చేశాడు. విలియమ్సన్‌ అవుటవ్వడానికి సోనూ సూద్‌ కారణం కాకపోయినప్పటికీ.. అభిమాని ట్వీట్‌కు సోనూ సూద్  స్పందించిన తీరు సోషల్‌ మీడియాలో సెన్సెషన్‌గా మారింది. దీంతో నిజంగానే సోనూసూద్‌ను ఏదైనా కోరుకుంటే అది జ‌రిగిపోతుందేమోనని నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు.

కోవిడ్ లాక్‌డౌన్‌ సమయంలో కొన్నివేల‌ మందిని సొంత గ్రామాల‌కు పంప‌డంలో సోనూసూద్ ఎలా సాయపడ్డాడో అలాగే భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించిన విలియ‌మ్స‌న్‌ను కూడా అదే త‌ర‌హాలో పెవిలియ‌న్‌కు పంపాడని సోషల్‌ మీడియాలో తెగ ట్రోల్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, సోనూ సూద్‌కు మొర‌పెట్టుకుంటే ఏ క‌ష్ట‌మైనా తీరిపోతుంద‌ని ప్ర‌జ‌లు భావిస్తుంటారు. అందుకు అనుగుణంగా ప్రజలు ఏది అడిగినా ఆయన తన వంతు సాయం చేస్తుంటాడు. ఈ క్రమంలో అతను దేశ‌వ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఆరాధ్య‌ దైవంగా మారాడు. ఆయ‌న స్ఫూర్తితో చాలా మంది తాము కూడా స‌మాజానికి ఏదైనా చేయాల‌ని ఆరాటప‌డుతున్నారు. 
చదవండి: టీమిండియా ఓటమికి ఆ ఇద్దరే కారణం: టెండూల్కర్‌

మరిన్ని వార్తలు