● నిబంధనల ఉల్లంఘనులపై ఎస్పీ ఆగ్రహం
నెల్లూరు(క్రైమ్): దీపావళి పండగ నేపథ్యంలో వీఆర్సీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బాణసంచా విక్రయ దుకాణాలను శనివారం ఎస్పీ డాక్టర్ కె.తిరుమలేశ్వరరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. లైసెన్సులతోపాటు బాణసంచాలు నిర్ణీత మోతాదులో నిల్వ చేశారా? అగ్నిప్రమాదాలు జరగకుండా ఫైర్సేఫ్టీ పరికరాలు, నీటి డ్రమ్ములు, ఇసుక తదితరాలను ఏర్పాటు చేశారా? స్వయంగా పరిశీలించారు. పలు దుకా ణాల్లో మంటలను ఆర్పేందుకు అగ్ని నిరోధక పరికరాలను ఏర్పాటు చేయకపోవడం, ఉన్నా ఎక్స్పైరీ అయిపోయి ఉండడంతో వ్యాపారులపై ఆగ్రహం వ్యక్తం చేసి వారి లైసెన్సులను స్వాధీనం చేసుకున్నారు. నీటి డ్రమ్ములు ఖాళీగా ఉండడంతో వెంటనే కార్పొరేషన్ అధికారులతో మాట్లాడి డ్రమ్ముల్లో నీటిని నింపాలని సూచించారు. అనేక మంది దుకాణదారులకు అగ్ని నిరోధక పరికరాల వినియోగంపై అవగాహన లేకపోవడంతో అగ్నిమాపక సిబ్బందితో డెమో ఇప్పించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిబంధనలు ఉల్లంఘిస్తే గోదాములు, దుకాణాలను సీజ్ చేయడంతోపాటు నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటే ఫైర్స్టేషన్ 101, డయల్ 100కు తెలియజేయాలని వ్యాపారులకు సూచించారు. ఎస్పీ వెంట నగర డీఎస్పీ డి.శ్రీనివాసరెడ్డి, ఎస్బీ, చిన్నబజార్ ఇన్చార్జి ఇన్స్పెక్టర్లు కె.రామకృష్ణారెడ్డి, బి.కల్యాణరాజు, చిన్నబజారు ఎస్సై సైదులు ఉన్నారు.