వివాహేతర సంబంధానికి అడ్డు వస్తోందనే యువతి హత్య

20 Aug, 2023 10:26 IST|Sakshi

శ్రీకాకుళం రూరల్‌: శ్రీకాకుళంలోని ఓ వైద్యుని ఇంటిలో జరిగిన హత్య కేసును పోలీసులు ఓ కొలిక్కి తెచ్చారు. తన వివాహేతర సంబంధాలకు అడ్డు వస్తోందని, ఎలాగైనా ఆమెను అడ్డు తొలగించుకోవాలని ఆ ఇంటి పనిమనిషి కొట్టు చిట్టెమ్మ ఈ నెల 14న అర్ధరాత్రి తోటి పనిమనిషి తాళ్లవలస రాజును హత్య చేసినట్లు పోలీసు విచారణలో తేలింది. దీనికి సంబంధించిన విషయాలను టౌన్‌ సీఐ సన్యాసినాయుడు శుక్రవారం విలేకరులకు వివరాలు వివరించారు. ఆ మేరకు..

విశ్రాంత వైద్యుడు గొల్ల జగన్నాథం గత నాలుగేళ్లుగా విశాఖపట్నంలోనే కుటుంబంతో నివాసం ఉంటున్నారు. శ్రీకాకుళంలోని పెదపాడు వీరన్నషెడ్‌ వద్ద ఉన్న ఇల్లు ఖాళీగా ఉంచకూడదని ఎంతో నమ్మకంగా తన వద్ద ఉన్న పనిమనుషులు చిట్టెమ్మ, రాజులను అక్కడే ఉంచి ఇంటి బాగోగులు వారికే అ ప్ప గించారు. వీరిలో చిట్టెమ్మ ప్రవర్తన చాలా అసభ్యకరంగా ఉండేదని, దీంతో రాజు ఆమెను పలుమార్లు మందలించేదని పోలీసులు తెలిపారు. గడిచిన ఆది వారం ఇలిసిపురంలో గల తన బంధువుల ఇంటికి వెళ్లిన రాజు సోమవారం సాయంత్రానికి ఆ ఇంటికి వచ్చింది.

అదేరోజు రాత్రి భోజనాలు అనంతరం మరోసారి చిట్టెమ్మతో వివాహేతర సంబంధాలపై ఇద్దరూ గొడవ పడ్డారు. ప్రతి విషయానికి నన్ను బెదిరిస్తావా అంటూ కోపోద్రిక్తమైన చిట్టెమ్మ అక్కడే ఉన్న చెక్క పేడుతో రాజు తలపై బలంగా మోదింది. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. చిట్టెమ్మ తన బట్టలకు అంటిన రక్తం, చెక్కపేడును ఎవ్వరికీ కనిపించకుండా వేరే ప్రదేశంలో పడేసి అదే రోజు పరారైనట్లు సీఐ తెలిపారు. క్లూస్‌టీం పరిశీలన అనంతరం చిట్టెమ్మను నగర శివారు ప్రాంతంలో రూరల్‌ పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం ఆమెను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెల్లడించారు.

మరిన్ని వార్తలు