కాశీబుగ్గ: దీపావళి సందర్భంగా పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీకి చెందిన కొత్తపల్లి రమేష్ ఆచారి పలుచటి బంగారం రేకు ఉపయోగించి దీపావళి లోగో తయారు చేశారు. 30 మిల్లీ గ్రాముల బంగారంతో రూపొందించిన ఈ లోగోను అగ్గిపుల్లపై నిలిపి ఆకట్టుకున్నారు.
ఘనంగా నరక చతుర్ధశి
అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయ ఉద్యాన మండపంలో శనివారం రాత్రి నరకచతుర్ధశి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఉషాపద్మినీఛాయ సమేతుడైన సూర్యనారాయణస్వామి ఉత్సవమూర్తులను ముందుగా గ్రామ మాడవీధులలో ఊరేగించి ఉద్యానవన మండపానికి తీసుకొచ్చారు. ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజల అనంతరం గడ్డితో చేసిన నరకాసుర విగ్రహాన్ని దహనం చేశారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది బీఎస్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
మా ఊరు దీపావళి
గార: శ్రీకాకుళం నగరానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో గార మండలంలో ఉన్న గ్రామం పేరు దీపావళి. ఈ పేరు వెనక పెద్ద చరిత్రే ఉంది. శ్రీకాకుళం ప్రాంతాన్ని పాలించే రాజు ప్రతిరోజూ గుర్రంపై కళింగపట్నం వెళ్తూ మార్గమధ్యలో శ్రీకూర్మం సమీపంలో లక్ష్మీనారాయణ గుడి వద్ద ఆగి స్వామిని దర్శించుకునేవాడు. ఓ రోజు గుడి వద్దకు వచ్చేసరికి సొమ్మసిల్లి పడిపోవడంతో అక్కడే ఉన్న వైష్ణవులు, గోవుల కాపరులు సపర్యలు చేశారు. మీరెవరు?ఇక్కడెందుకు ఉన్నారని రాజు ప్రశ్నించగా.. ఇక్కడికి కొద్ది దూరంలోనే తమ గుడిసెలున్నాయని, ఆ ప్రాంతానికి పేరు లేదని చెబుతారు. దీనికి స్పందించిన రాజు ఇకపై ఆ ప్రాంతాన్ని దీపావళిగా పిలవాలని, రికార్డుల్లో కూడా నమోదు చేస్తామని చెప్పి ఆ విధంగా చర్యలు తీసుకున్నారు. అప్పటి నుంచి అదే పేరు స్థిరపడిందని గ్రామస్తులు చెబుతుంటారు.
సీఎం జగన్తోనే
సామాజిక సాధికారత
● 15న నరసన్నపేట సభకు తరలిరావాలి
నరసన్నపేట: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే రాష్ట్రంలో సామాజిక సాధికారత సాధ్యమైందని కళింగవైశ్య, కాపు, కాళింగ, శ్రీశయన, రెడ్డిక, పొందర కూరాకుల కార్పొరేషన్ చైర్మన్లు అంధవరపు సూరిబాబు, మామిడి శ్రీకాంత్, పేరాడ తిలక్, డి.పి.దేవ్, దుక్క లోకేశ్వరరెడ్డి, రాజాపు హైమావతి అన్నారు. నరసన్నపేటలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం వారు విలేకరులతో మాట్లాడారు. సామాజిక సాధికార బస్సుయా త్ర మూడు చోట్ల విజయవంతంగా జరిగిందని, ఈ నెల 15న నరసన్నపేటలోనూ యాత్ర జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర పొందర సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజాపు అప్పన్న తదితరులు పాల్గొన్నారు.