లారీ ఢీకొని టీచర్‌ ధనలక్ష్మి మృతి

20 Oct, 2023 13:05 IST|Sakshi
టీచర్‌ ధనలక్ష్మి (ఫైల్‌)

వేలూరు: కాట్పాడి సమీపంలో లారీ ఢీకొనడంతో ప్రైవేట్‌ స్కూల్‌లో పనిచేస్తున్న టీచర్‌ మృతిచెందారు. పోలీసుల కథనం మేరకు.. వేలూరు శలవన్‌పేటకు చెందిన ఆరుముగం భార్య ధనలక్ష్మి(36) కాట్పాడి సమీపంలోని క్రిష్టియన్‌పేటలోని ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు.

ఆమె బైక్‌లో పాఠశాలకు వెళుతోంది. గురువారం ఉదయం ఇంటి నుంచి బయలుదేరింది. కాట్పాడి సమీపంలోని కల్‌పదూరు వద్ద సైకిల్‌పై వెళుతున్న వృద్ధుడిని తప్పించబోయి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొని కింద పడింది.

ఆ సమయంలో వెనుక వైపున కాట్పాడి నుంచి చిత్తూరు వెళుతున్న లారీ ధనలక్ష్మిని ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న కాట్పాడి పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న లారీ డ్రైవర్‌ కోసం గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు