భర్త బెంగళూరులో మరొక వ్యక్తితో భార్య వివాహేతర సంబంధం..

31 Oct, 2023 06:54 IST|Sakshi

తమిళనాడు: వివాహేతర సంబంధం రెండు ప్రాణాలను బలిగొంది. తిరుపత్తూరు జిల్లా వానియంబాడి ప్రాంతానికి చెందిన చంద్రశేఖరన్‌(35) కూలి పనులు చేసూకుంటూ భార్య, ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నాడు. పనుల కోసం ఆరు నెలల క్రితం బెంగళూరుకు వెళ్లాడు. బెంగళూరులో ఆవలాంకుప్పం గ్రామానికి చెందిన దేవరాజ్‌ భార్య పూజ(26)తో పరిచయం ఏర్పడింది. కొద్ది రోజులకే వివాహేతర సంబంధానికి దారి తీసింది.

ఈ క్రమంలో రెండు నెలల క్రితం చంద్రశేఖరన్‌ పూజను వానియంబాడికి తీసుకొచ్చాడు. భార్యభర్తలమని చెప్పి అద్దె ఇల్లు తీసుకుని కాపురం పెట్టాడు. విషయం తెలుసుకున్న పూజ బంధువులు సోమవారం ఉదయం వానియంబాడికి వచ్చారు. పూజను కారులో బెంగళూరు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో ఇరువార్గాల మధ్య వాగ్వాదం జరిగింది.

ఆగ్రహించిన చంద్రశేఖరన్‌ సమీపంలోని వ్యవసాయ బావిలో దూకాడు. గమనించిన పూజ మరో బావిలో దూకింది. ఇద్దరూ నీట మునిగి మృతి చెందారు. బంధువులు వానియంబాడి పోలీసులకు సమాచారం అందజేయడంతో పోలీసులు ఇద్దరి మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు విచారణ చేస్తున్నారు. వివాహేతర సంబంధాలు చివరకు విషాదాంతంతోనే ముగుస్తుందని ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది.

మరిన్ని వార్తలు