Hyderabad IT Raids Updates: మూడో రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు

16 Jun, 2023 08:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో బుధవారం మొదలైన ఐటీ సోదాలు శుక్రవారం మూడోరోజూ కొనసాగుతున్నాయి. వైష్ణవి గ్రూప్ స్థిరాస్తి సంస్థ, హోటల్ అట్ హోమ్ సంస్థలు వాటి అనుబంధ సంస్థల్లో సోదాలు కొనసాగుతున్నాయి.

వీటితో పాటు ఆయా సంస్థల కార్యాలయాల్లో మేనేజింగ్‌ డైరెక్టర్లు , సీఈఓల ఇళ్లలో అధికారులు తనీఖీలు చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి ,శేఖర్ రెడ్డి ఇళ్లల్లో సైతం అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాలల్లో 70 మంది ఐటీ అధికారుల బృందాలు పాల్గొన్నాయి.

పైళ్ల శేఖర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి కలసి చేసిన రియల్‌ ఎస్టేట్, మైనింగ్‌ సహా ఇతర వ్యాపారాలపై ఐటీ శాఖ దృష్టి పెట్టింది. ఇందులో హిల్‌ల్యాండ్, మైన్స్‌ల్యాండ్, తీర్థ ప్రాజెక్ట్స్‌ ప్రైవేటు లిమిటెడ్, శ్రీలార్వెన్‌ సిండికేట్‌ సంస్థల్లో ఈ ముగ్గురికీ చెందిన కుటుంబ సభ్యులే భాగస్వాములుగా ఉండటంతో ఇందుకు సంబంధించిన వివరాలను ఐటీ అధికారులు సేకరిస్తున్నారు.

హైదరాబాద్, బెంగళూరులో సాగించిన వెంచర్లు, విల్లాల అమ్మకాల్లో నగదు రూపంలో జరిగిన లావాదేవీలపైనా ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలు వారి కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్న బ్యాంకు లాకర్లను గుర్తించి తెరవగా కీలక డాక్యుమెంట్లు, విలువైన ఆభరణాలు బయటపడ్డట్లు తెలిసింది.
చదవండి: ఢిల్లీలో కేసీఆర్, ఖర్గే చేతులు కలిపారు.. రేవంత్‌ పరిస్థితి ఏంటో!

మరిన్ని వార్తలు