వర్షాలపై అప్రమత్తం: మంత్రి సత్యవతి 

10 Sep, 2021 04:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ఐటీడీఏ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితులపై ప్రతిరోజు తన కార్యాలయానికి నివేదికలు పంపాలని సూచించారు. గురువారం ఆమె తన కార్యాలయం నుంచి ఐటీడీఏ, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వరుసగా కురుస్తున్న వర్షాల వల్ల ఏజెన్సీ ప్రాంతాల్లో వరదల కారణంగా ప్రజలకు ఇబ్బంది రాకుండా చూడాలన్నారు.

గర్భిణీ స్త్రీలను వారి ప్రసవ గడువు తేదీల ప్రకారం ఆస్పత్రుల్లో చేర్పించే చర్యలు చేపట్టాలన్నారు. ఎవరికైనా అనారోగ్యం కలిగినా, ప్రమాదం జరిగినా రవాణా సదుపాయం లేక ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే వర్షాల వల్ల సీజనల్‌ వ్యాధులు రాకుండా అన్ని చర్యలు చేపట్టాలని, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి మండలానికి ఒక అధికారిని ఇన్‌చార్జీగా నియమించి, బాధ్యతలు ఇవ్వాలన్నారు.  

మరిన్ని వార్తలు