Warangal: వామ్మో! అంతుచిక్కని వైరస్‌తో 4వేల కోళ్లు మృతి

21 Mar, 2022 13:31 IST|Sakshi

వరంగల్ (నెక్కొండ): అంతు చిక్కని వ్యాధితో 4వేల కోళ్లు మృత్యువాతపడిన ఘటన వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలంలోని మడిపెల్లి శివారు హరిశ్చంద్రుతండాలోని సరిత పౌల్ట్రీపామ్‌లో జరిగింది. యజమాని తేజావత్‌ మురళీనాయక్‌ తెలిపిన వివరాలు ప్రకారం.. పౌల్ట్రీనపామ్‌లో 25 రోజుల నుంచి 11,300 కోళ్లను పెంచుతున్నాడు. ఈ క్రమంలో మూడురోజులుగా రోజుకు 1,000కి పైగా కోళ్లు మృతి చెందుతున్నాయి.

ఇప్పటి వరకు 4వేల కోళ్లు మృతి చెందాయి. మరో రెండుమూడు రోజులు గడిస్తే పామ్‌లోని మిగితా కోళ్లు కూడా మృతిచెందే అవకాశం ఉందని యజమాని వాపోయాడు. కోళ్లకు కిడ్నీ వాపు, లివర్‌ ఇన్‌ఫెక్షన్‌ వచ్చి మృతి చెంది ఉండవచ్చని యజమాని అనుమానం వ్యక్తం చేశాడు. కాగా ఇప్పటి వరకు రూ. 6లక్షల నష్టం వాటిల్లిందని, మిగితా కోళ్లు మృతి చెందితే మరో రూ.15 లక్షలు నష్టపోవాల్సి వస్తుందని ఆయన కన్నీరుమున్నీరయ్యారు. మృతి చెందిన కోళ్లను గోతి తోపాతిపెట్టినట్లు యజమాని పేర్కొన్నారు.  

పోస్టుమార్టం నిర్వహిస్తాం.. 
పౌల్ట్రీపామ్‌లో మృతి చెందిన కోళ్ల వ్యాధి నిర్ధారణ కోసం పోస్టుమార్టం నిర్వహిస్తాం. ప్రస్తుతం కోళ్లు రానికెట్, బర్డ్‌ ఫ్లూ, వీవీ ఆర్డీ వ్యాధులతో పెద్ద మొత్తంలో మృత్యువాత పడతాయి. లేదా వేసవి తాపం, సాధారణ వ్యాధులతో కోళ్లు మృతి చెంది ఉండవచ్చు. కోళ్ల మృతి విషయం జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. ఏడీడీఎల్‌ ఏడీ నాగమణి ఆధ్వర్యంలో పోస్టుమార్టం జరుగుతుంది. అలాగే పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపాం.
మమత, పశువైద్యాధికారి, నెక్కొండ  

మరిన్ని వార్తలు