కేసీఆర్‌ను కలిసిన చింతమడక గ్రామస్తులు

7 Dec, 2023 00:35 IST|Sakshi

మళ్లీ సీఎం కావాలంటూ నినాదాలు

సిద్దిపేట రూరల్‌/మర్కూక్‌ (గజ్వేల్‌): బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్‌ ఎమ్మెల్యే కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును తన స్వగ్రామమైన చింతమడక గ్రామస్తులు కలిశారు. బుధవారం తొమ్మిది బస్సుల్లో సుమారు 540 మంది గ్రామస్తులు సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలం ఎర్రవల్లిలోని కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు. ఆ సమయంలో కేసీఆర్‌ను పలువురు ప్రముఖులు కలుస్తున్నందున వారిని లోపలికి వెళ్లేందుకు పోలీసులు అనుమతివ్వలేదు. దీంతో సుమారు రెండు గంటలపాటు నిరీక్షించారు.

అనంతరం లోపలికి అనుమతించారు. దీంతో కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ నుంచి బయటకు వచ్చారు. ఆయన్ను చూసిన గ్రామస్తులు భావోద్వేగానికి గురయ్యారు. కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటూ నినాదాలు చేశారు. అయితే...ఆయన మాట్లాడకుండానే అభివాదం చేస్తూ లోపలికి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీశ్‌రావు తదితరులు ఉన్నారు.  

>
మరిన్ని వార్తలు