తెలంగాణ ఎంసెట్‌ ‘కీ’ విడుదల..

18 Sep, 2020 19:51 IST|Sakshi

సాక్షి, జేఎన్టీయూ: రాష్ట్రంలో నిర్వహించిన ఎంసెట్ పరీక్ష ‘కీ’ని అధికారులు శుక్రవారం విడుదల చేశారు. ఎంసెట్‌ కీ ఈ రోజు(శుక్రవారం) నుంచి సెప్టెంబర్‌ 20 (ఆదివారం) సాయంత్రం 5 గంటల వరకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్‌  9,10,11,14 తేదీల్లో జరిగిన ఎంసెట్‌ ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్‌లో 1 లక్ష 19వేల187 మంది విద్యార్థులు ఎంసెట్‌ పరీక్షకు హాజరయ్యారని తెలంగాణ ఎంసెట్‌ కన్వీనర్‌ గోవర్ధన్ తెలిపారు.

ఎంసెట్‌ పరీక్షకు సంబంధించి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొత్తం ఎనిమిది ప్రశ్నపత్రాలకు సంబంధించిన ఎంసెట్‌ ప్రాథమిక కీతోపాటు విద్యార్థుల ఓఎంఆర్‌ పేపర్ స్కానింగ్‌ కాపీలనూ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని తెలిపారు. ప్రాథమిక ‘కీ’ పై అభ్యంతరాలుంటే వాటిని స్వీకరించి నిపుణుల కమిటీ తుది కీను నిర్ణయిస్తుందని తెలిపారు. తుది ‘కీ’ ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తామని, ఎంసెట్‌ ‘కీ’ సంబంధించిన వివరాలను అభ్యర్థులు https://eamcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చని గోవర్ధన్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు