చంద్రయాన్‌–3లో ఈసీఐఎల్‌ కీలక భూమిక

25 Aug, 2023 01:13 IST|Sakshi

ఇస్రోకు డీఎస్‌ఎన్‌ యాంటెన్నాను అందించిన ఈసీఐఎల్‌ 

కుషాయిగూడ (హైదరాబాద్‌): చంద్రయాన్‌–3లో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎల్రక్టానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌) కీలక భూమిక పోషించింది. చంద్రయాన్‌ కమ్యూనికేషన్‌కు కీలకమైన 32 మీటర్‌ డీప్‌ స్పేస్‌ నెట్‌వర్క్‌ (డీఎస్‌ఎన్‌) యాంటెన్నాను సరఫరా చేసిందని   సంస్థ వర్గాలు గురువారం ఓ ప్రకటనలో తెలిపాయి.

300 టన్నుల ఈ యాంటెన్నా వ్యవస్థను బాబా అటామిక్‌ రీసెర్చ్, యూఆర్‌ రావు శాటిలైట్‌ సెంటర్, ఐఎస్‌టీఆర్‌ఏసీలతో కలిసి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినట్లు చెప్పాయి. చంద్రుడి ఉపరితలంపై 0.3 మిల్లీమీటర్ల పరిమాణం కలిగిన వాటినీ క్షుణ్ణంగా చూపించేలా వీల్‌ అండ్‌ ట్రాక్‌ మౌంట్, బీమ్‌ వేవ్‌ గైడ్, ఫీడ్‌ సిస్టమ్‌తో కూడిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని యాంటెన్నాలో అమర్చినట్లు చెప్పాయి.

చంద్రుడిపై తీసే చిత్రాలు, డేటాను స్వాదీనం చేసుకోవడంలోనూ ఈ యాంటెన్నా కీలక పాత్ర పోషిస్తుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన యాంటెన్నా సిస్టమ్‌తో పాటుగా సేఫ్‌ అండ్‌ సెక్యూర్‌ ప్రోగ్రామబుల్‌ లాజిక్‌ కంట్రోల్‌ (పీఎల్‌సీ)ని అందిస్తూ ఇస్రోతో ఈసీఐఎల్‌ సన్నిహితంగా పనిచేస్తోందని ఆ వర్గాలు చెప్పాయి. రాబోయే ఆదిత్య, గగన్‌యాన్, మంగళ్‌యాన్‌–2 మిషన్లకు కూడా ఈసీఐఎల్‌ పనిచేస్తుందని పేర్కొన్నాయి. 
 

మరిన్ని వార్తలు