లోపం ఎక్కడుంది?

9 Dec, 2023 04:43 IST|Sakshi

రంగారెడ్డి జిల్లా ‘ధరణి’లో అక్రమాలపై అంతా సైలెంట్‌

గుట్టుగా ఆమోదం పొందినా గుర్తించని అధికారులు

 ఇద్దరు నిందితులను విచారిస్తున్న పోలీసులు 

తమకు ఏమీ తెలియదంటున్న నిందితులు

సాక్షి, రంగారెడ్డిజిల్లా: భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ధరణి’పోర్టల్‌ కొంత మందికి కాసుల వర్షం కురిపిస్తోంది. భూమి విస్తీర్ణం, ప్రాంతాన్ని బట్టి దరఖాస్తులకు ధరలు నిర్ణయిస్తున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల నుంచి, అలాగే రైతుల ఇబ్బందులను అవకాశంగా తీసుకుని కొందరు ఈ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు.

అడిగినంత ముట్టజెప్పితే చాలు.. క్షేత్రస్థాయి నివేదికలు, సంబంధిత ఉన్నతాధికారుల సంతకాలతో సంబంధం లేకుండానే వివాదాస్పద భూములను సైతం మార్పిడి చేసేస్తున్నారు. అప్పటి వరకు నిషేధిత జాబితాలో ఉన్న భూములు కూడా క్లియర్‌ అవు తుండటాన్ని పరిశీలిస్తే.. ఖరీదైన ప్రభుత్వ, అసైన్డ్, భూదాన్, అర్బన్‌ సీలింగ్‌ భూములు ఏ విధంగా అన్యాక్రాంతమ వుతున్నాయో అర్థం చేసు కోవచ్చు.

ఇటీవల రంగా రెడ్డి జిల్లా ధరణి పోర్టల్‌లో చోటు చేసుకున్న అక్రమాలే ఇందుకు నిదర్శనమని చెపుతున్నారు. జిల్లా కలెక్టర్‌ లాగిన్‌ చేస్తే కానీ ఓపెన్‌ కానీ ధరణి ఫోర్టల్‌ ఏవిధంగా తెరుచుకుంది? 98 వివాదా స్పద దరఖాస్తులు ఏ విధంగా క్లియర్‌ అయ్యా యనేది? అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది. 

అనుమానం మొదలైంది అక్కడే..
రంగారెడ్డి జిల్లాలో ధరణి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్‌ అక్టోబర్‌ 20 నుంచి 23 మధ్యలో 20 దరఖాస్తులను క్లియర్‌ చేసేందుకు పోర్టల్‌ లాగిన్‌ను ఓపెన్‌ చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో ధరణి ఆపరేటర్లు వారికి ముడు పులిచ్చినవారికి సంబంధించిన వివాదాస్పద దరఖాస్తులను (అక్టోబర్‌ 14 నుంచి నవంబర్‌ 11 మధ్య కాలంలో) క్లియర్‌ చేసుకున్నట్లు తేలింది. అయితే తాను కేవలం 20 దరఖాస్తులనే ఆమోదిస్తే.. వివిధ కేటగిరీలకు సంబంధించిన మరో 98 దరఖాస్తులు ఎలా క్లియర్‌ అయ్యాయనే అంశంపై ఇటీవల కలెక్టర్‌కు అనుమానం వచ్చినట్లు తెలిసింది. 

అన్నీ వివాదాస్పద భూములవే..
ఆ వెంటనే జిల్లా కలెక్టర్‌ సీసీఎల్‌ఏ అధికారులను సంప్రదించారని సమాచారం. అయితే అటు నుంచి సరైన సమాధానం రాకపోవడంతో అధికారులు అంతర్గత విచారణ చేపట్టారు. తన ప్రమేయం లే కుండానే వివాదాస్పదంగా ఉన్న 98 దరఖాస్తులు ఆమోదం పొందిన అంశాన్ని కలెక్టర్‌ భారతిహోళికేరి సీరియస్‌గా తీసుకున్నారు. దీంతో కలెక్టరేట్‌ పరిపాలనాధికారి ఈనెల 5న పోస్ట్‌ ద్వారా ఆదిభట్ల పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు పంపారు. దీంతో పోలీసులు ఈ వ్యవహారంలో ప్రమే యం ఉందని భావిస్తున్న ధరణి సమన్వయకర్త నరేశ్, ఆపరేటర్‌ మహేశ్‌లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మాకు ఏ పాపం తెలియదు.. 
కలెక్టర్‌ ప్రమేయం లేకుండా దరఖాస్తులు ఎలా క్లియర్‌ అయ్యాయనే అనుమానం సర్వత్రా వ్యక్తమవుతున్నా.. వాటిని నివృత్తి చేయాల్సిన అధికారులంతా గప్‌చిప్‌ అయ్యారని తెలుస్తోంది. ఎవరికి వారు తమకు సంబంధం లేదు అన్నట్లుగా మిన్నకుండిపోయారని చెపుతున్నా రు. ఇదిలా ఉంటే పోలీసుల అదుపులో ఉన్న నిందితులు నరేశ్, మహేశ్‌లు సైతం తమకే పా పం తెలియదని చెపుతున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై లోతైన విచారణ జరిపితే కానీ అక్రమాల్లో ఎవరెవరి పాత్ర ఉందన్న విషయం బయటకు రాదని స్థానికులు అంటున్నారు.  

>
మరిన్ని వార్తలు