HYD: ఐపీఎస్‌ల పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌కు హాజరైన అమిత్‌షా

27 Oct, 2023 08:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఐపీఎస్‌ల పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 175 మంది ఐపీఎస్‌ అధికారుల నుంచి అమిత్‌షా గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఐపీఎస్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళ సై, తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్‌ పాల్గొన్నారు. ముందుగా నేషనల్ పోలీస్ అకాడమీలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి అమిత్ షా నివాళులర్పించారు.

దేశ ప్రతిష్టలు కాపాడంలో పోలీస్ వ్యవస్థ రోల్ చాలా కీలకమని, దేశానికి సేవలు అందించడంలో ఐపీఎస్‌లు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని అమిత్‌షా అన్నారు. పీడిత ప్రజల అభ్యున్నతి, భద్రత కోసం నిబద్దతతో పనిచేయాలన్నారు. 75వ బ్యాచ్ ఐపీఎస్ శిక్షణలో 33 మంది మహిళలు ఉండడం సంతోషం, గర్వకారణం. సైబర్ నేరాల అదుపు, నేరగాళ్లకు చెక్ పెట్టడంలోనూ టెక్నాలజీ పై ఐపీఎస్‌లు దృష్టి కేంద్రీకరించాలి. భవిష్యత్‌లో ఎదురయ్యే ఎన్నో సవాళ్లను ఐపీఎస్‌లు అలవోకగా ఎదుర్కొవాలి. అంతిమంగా ఐపీఎస్‌లు ప్రజల భద్రత అందించడంలో మనసులు గెలవాలని అమిత్‌షా పిలుపునిచ్చారు.

విజయవంతంగా మొదటి దశ శిక్షణ పూర్తి చేసిన యువ ఐపీఎస్‌ అధికారులు విధి నిర్వహణలో తొలి అడుగు వేయబోతున్నారు. శుక్రవారం ఉదయం సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జాతీయ పోలీస్‌ అకాడమీ (ఎస్‌వీపీఎన్‌పీఏ)లో 75వ రెగ్యులర్‌ రిక్రూటీస్‌ (ఆర్‌ఆర్‌) బ్యాచ్‌కు చెందిన 155 మంది యువ ఐపీఎస్‌ అధికారులు, వీరితోపాటు శిక్షణ పొందిన మరో 20 మంది విదేశీ అధికారులు పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌లో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు