లక్డీకాపూల్: నిమ్స్ ఆస్పత్రిలో గుండె మార్పిడి ఆపరేషన్ విజయవంతమైంది. బ్రెయిన్ డెడ్గా మారిన వ్యక్తి నుంచి సేకరించిన గుండెను శనివారం ఉదయం కేవలం 3 గంటల వ్యవధిలోనే మరో వ్యక్తికి అమర్చినట్లు ఆస్పత్రి సీటీ సర్జన్ హెచ్ఓడీ డాక్టర్ ఎం. అమరేష్రావు తెలిపారు. కరీంనగర్ జిల్లా రేకుర్తికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు అస్తాపురం మల్లయ్య (51) ఈ నెల16న రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. చికిత్స నిమిత్తం సోమాజిగూడ యశోద ఆస్పత్రికి తరలించారు.
అక్కడ రెండు రోజుల పాటు చికిత్స పొందిన మల్లయ్య ఈ నెల 18న బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో జీవన్దాన్ బృందం అవయవ దానంపై ఆయన కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించింది. మృతుడి భార్య హేమలత, కుటుంబ సభ్యులు దీనికి అంగీకరించారు. ఈ క్రమంలో రెండు కిడ్నీలు, లివర్, గుండె, కళ్లను వైద్యులు సేకరించారు. అప్పటికి గుండె మార్పిడి కోసం నిమ్స్ ఆస్పత్రిలో ఎదురు చూస్తున్న శంకర్ గౌడ్ అనే వ్యక్తికి మల్లయ్య నుంచి సేకరించిన గుండెను అమర్చినట్టు నిమ్స్ తెలిపారు.