ఓయూలో  ఐడియాలకు ఆహ్వానం

9 Jul, 2022 07:33 IST|Sakshi

కొత్తగా బీ ఫార్మసీ కోర్సు ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌(ఉస్మానియా యూనివర్సిటీ): ఓయూ టెక్నాలజీ కాలేజీ (సాంకేతిక విద్య) వివిధ రకాల న్యూ ఐడియాలను (కొత్త ఆలోచనలు) ఆహ్వానిస్తోంది. శుక్రవారం కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రిన్సిపాల్‌ ప్రొ.చింత సాయిలు మాట్లాడుతూ కొత్త ఆలోచణలు, ఆవిష్కరణల అభివృద్ధికి కాలేజీలో ఇంక్యుబేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు  చెప్పారు. అభివృద్ధి, పరిశ్రమల స్థాపనకు తోడ్పడేలా ఎవరైనా ఎలాంటి ఐడియాలు ఉన్నా తమతో షేర్‌ చేసుకోవచ్చన్నారు.

స్వీకరించిన ఐడియాలపై పరిశోధనలు జరిపి సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్ది సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు దోహదపడేలా చేస్తామన్నారు. దీనిపై 9959167505, 9849636589 నంబర్లకు ఫోన్‌ చేయవచ్చన్నారు. కేంద్ర ప్రభత్వ మినిస్ట్రీ ఆఫ్‌ ఇండస్ట్రీ ఏర్పాటు చేసిన ఐడియా హ్యాకథాన్‌కు ఓయూ టెక్నాలజీ కాలేజీ నుంచి 10 కొత్త ఐడియాలను పంపించామన్నారు.

అందులో ప్రిన్సిపాల్‌ ప్రొ.చింత సాయిలు, ప్రొ.తాటి జ్యోతి, పరిశోధక విద్యార్థి అభిలాష్‌ సమర్పించిన వ్యర్థ జలాల శుద్ధి, మైక్రోబియల్‌ ఫ్యూయల్‌ సెల్‌ ఉపయోగించి విద్యుత్తు ఉత్పత్తి తయారు అనే ఐడియాలు ఎంపికయ్యాయని వివరించారు. ఓయూ క్యాంపస్‌ టెక్నాలజీ కాలేజీలో 2022–23 విద్యా సంవత్సరం నుంచి 60 సీట్లతో కొత్తగా బీఫార్మసీ కోర్సును ప్రారంభిస్తున్నట్లు, టెక్స్‌టైల్స్‌ టెక్నాలజీ కోర్సులో 30 నుంచి 60 సీట్లకు పెంచుతున్నట్లు ప్రిన్సిపాల్‌ సాయిలు వివరించారు.

చదవండి: నా కళ్ల ముందే కొట్టుకుపోయాయి: రాజాసింగ్‌

మరిన్ని వార్తలు