BJP Raja Singh: హైదరాబాద్‌ పోలీసుల సంచలన ప్రకటన.. రాజా సింగ్‌పై పీడీ యాక్ట్‌

25 Aug, 2022 16:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీయాక్ట్‌ నమోదు అయినట్టు హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ వెల్లడించారు. చాలాసార్లు ఒక మతాన్ని, వర్గాన్ని కించపరిచేలా రాజాసింగ్‌ వ్యాఖ్యలు చేశారని ఆయన గురువారం మీడియాకు తెలిపారు. మంగళహాట్‌ పోలీస్‌ స్టేషన్‌లో గతంలో రాజాసింగ్‌పై రౌడీషీట్‌ ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఈ  కేసులు ఆధారంగా చేసుకొని బీజేపీ ఎమ్మెల్యేపై పీడి యాక్ట్ నమోదు చేసినట్టు చెప్పారు. అరెస్టుకు ముందు ఆయనకు 32 పేజీల పీడీ యాక్ట్‌ డాక్యుమెంట్‌ను అందించినట్టు కమిషనర్‌ వెల్లడించారు.

కాగా, ఈనెల 22న ఓ యూట్యూబ్‌ చానల్‌లో రాజాసింగ్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని తెలిపారు. మహ్మద్‌ ప్రవక్తకు వ్యతిరేకంగా అభ్యంతరకరంగా రాజాసింగ్‌ మాట్లాడారని అన్నారు. ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఒక ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్‌ నమోదవ్వడం ఇదే తొలిసారి. ఇక 2004 నుంచి రాజాసింగ్‌పై 101 క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 18 మతపరమైన కేసులు ఉన్నాయి. వీటిలో కొన్ని సరైన సాక్ష్యాధారాలు లేక వీగిపోయాయి. మరికొన్నికోర్టు విచారణలో ఉన్నాయి.
చదవండి: ఒక్క ఉప ఎన్నిక కోసం బీజేపీ ఇంత బరితెగించాలా: ఎంపీ అసదుద్దీన్‌

మరిన్ని వార్తలు