‘తాళిబొట్టు’ ఘటనపై విచారణ

2 Jul, 2021 08:50 IST|Sakshi
భూమి రికార్డులు పరిశీలిస్తున్న ఆర్‌డీవో

నివేదిక ఇవ్వాలని ఆర్‌డీవోకు కలెక్టర్‌ ఆదేశం

ద్రంగి (వేములవాడ): రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి తహసీల్దార్‌ కార్యాలయ గు మ్మానికి ఓ మహిళ తాళిబొట్టు వేలాడదీసిన ఘటనను కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ సీరియస్‌గా తీసుకున్నారు. విచారణ చేపట్టి, నివేదిక ఇవ్వాలని ఆర్డీవో శ్రీనివాస్‌ను ఆదేశించారు. దీంతో ఆర్డీవో గురువారం రుద్రంగి మండ లం మానాల గ్రామంలోని వివాదాస్పద స్థలాన్ని పరిశీలించారు. ఇరువర్గాలు, గ్రామ పెద్దల నుంచి వివరాలు సేకరించారు. పట్టా పాసుపుస్తకాలు, పలు పత్రాలను పరిశీలించారు. తహసీల్దార్‌ శ్రావణ్‌కుమార్‌ నుంచి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ, పట్టా మార్పిడికి రుద్రంగి రెవెన్యూ సిబ్బందికి సంబంధం లేదని చెప్పారు.

మానాల గ్రామం పాతకమ్మర్‌పెల్లి మండలం నిజామాబాద్‌ జిల్లాలో ఉన్న సమయంలోనే 2011–12లో సర్వేనంబర్‌ 130/14లోని రెండెకరాల వ్యవసాయ భూమి పొలాస రాజలింగం పేరు నుంచి పొలాస రాజం పేరిట పట్టా మార్పు జరిగిందని తెలిపారు. తర్వాత రాజం కోడలు పొలాస జల పట్టా చేసుకుందని చెప్పారు. పొలాస జల ఒక్కరే పట్టా చేసుకోవడంతో సమస్య తలెత్తిందని, పొలాసమంగకు రెండెకరాలలో రావాల్సిన వాటా కుటుంబ సమస్య కాబట్టి గ్రామ పెద్దల సమక్షంలో మాట్లాడుకోవాలని సూచించినట్లు తెలిపారు. తన తాళిబొట్టు తీసుకుని అయినా భూమిపట్టా మార్చాలంటూ తహసీల్దార్‌ కార్యాలయం గుమ్మానికి మంగ తాళిబొట్టు వేలాడదీసిన విషయం విదితమే. 


 

మరిన్ని వార్తలు